తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా నియామకం పై ఎక్కడలేని గందరగోళం నెలకొంది.ఈ వ్యవహారం పార్టీకి తలనొప్పిగా మారుతూ వస్తోంది.
కాంగ్రెస్ లోని గ్రూపు రాజకీయాలకు మరోసారి తెరలేపినట్టు అయ్యింది.అధ్యక్ష పీఠం కోసం పెద్ద ఎత్తున ఆశావహులు పోటీపడుతూ, తమకే పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలని , తామే సీనియర్ నాయకులము అని, మేమే పార్టీని ముందుకు నడిపించగలము అని చెబుతూ , అధిష్టానం దగ్గర తమ పలుకుబడి మొత్తం ఉపయోగిస్తూ, ఎటువంటి ఇబ్బందులు లేకుండా పదవి దక్కించుకోవాలి అనే విధంగా వ్యవహరిస్తూ వస్తున్నారు.
ఈ మేరకు ఢిల్లీకి వెళ్లి మరీ అధిష్టానం పెద్దలను కలుస్తూ హడావుడి చేస్తున్నారు.ఈ వ్యవహారాలు కాంగ్రెస్ అధిష్టానానికి కూడా తలనొప్పిగా మారాయి.ఇప్పటికే తెలంగాణ లోని పార్టీ నాయకుల అభిప్రాయం ఏమిటి అనే విషయాన్ని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ సేకరించి అధిష్టానానికి నివేదిక పంపారు.ఇంకా దానిపై ఎటువంటి అభిప్రాయానికి రాకముందే, నాయకులంతా ఢిల్లీకి క్యూ కట్టడం, అజ్ఞాత లేఖలు రాయడం వంటి వ్యవహారాలు ఇబ్బందికరంగా మారాయి.
ఇప్పటికే కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సోనియా గాంధీని కలిసేందుకు ఢిల్లీకి వెళ్లి కలిసారు.
ఇలా ఒక్కో నేత ఢిల్లీకి వస్తుండడం తో అధిష్టానం వద్దకు ఈ పదవి విషయంపై రావద్దు అని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది.ప్రస్తుతం అధ్యక్షుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే విషయంపైనా, పార్టీ అధిష్టానం ఒక నిర్ణయానికి రాకపోవడంతో, మరికొంతకాలం అధ్యక్షుడి ఎంపిక వాయిదా వేసే ఆలోచనలో కాంగ్రెస్ ఉంది.మరికొంత సమయం తీసుకుని పార్టీలో సీనియర్ నాయకులు అభిప్రాయాలు అన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, ఎవరికీ నష్టం జరగకుండా , పార్టీకి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా అధ్యక్షుడి ఎంపిక పూర్తి చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉంది.
అందుకే ఇప్పట్లో పిసిసి అధ్యక్ష పదవి భర్తీ చేసే అవకాశం లేనట్లు తెలుస్తోంది.