రాజకీయాలు అంటే వడ్డించిన విస్తరి కాదు.రాజకీయాల్లో రాణించాలంటే పరిస్థితుల తమకు అనుకూలంగా మార్చుకుని ప్రతి దశలోనూ సక్సెస్ అవుతూనే రావాలి.
రాబోయే ప్రమాదాలను ముందుగానే ఊహించుకుని దానికి అనుగుణంగా ముందుకు వెళితే, ఆ తరువాత వెనుకబడాల్సిన పరిస్థితి ఉండదు.అలా కాకుండా ఇష్టానుసారంగా అధికారంలో ఉన్న సమయంలో విర్రవీగితే ఆ తరువాత రాజకీయ జీవితం ఎన్ని ఒడిదుడుకులు తిరుగుతుందో చెప్పడం కష్టం.
అటువంటి ఎన్నో ఒడిదుడుకులను ఇప్పుడు ఎదుర్కొంటున్నారు అనంతపురం జిల్లా సీనియర్ పొలిటిషియన్స్ జెసి బ్రదర్స్.మంత్రిగా , ఎంపీగా మంచి గుర్తింపు తెచ్చుకుని ఏ పార్టీ అధికారంలో ఉన్నా , అనంతపురం జిల్లాలో తమ హవా కొనసాగే విధంగా చేసుకోవడంలో సక్సెస్ అవుతూ వచ్చారు దివాకర్ రెడ్డి.
ఇక ఆయన సోదరుడు ప్రభాకర్ రెడ్డి సైతం గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు.
ఇక గత టీడీపీ ప్రభుత్వం లో జేసీ బ్రదర్స్ జగన్ ను పూర్తిగా టార్గెట్ చేసుకుంటూ వ్యక్తిగతంగా విమర్శలు చేయడం, జగన్ తల్లి విజయమ్మ పైనా అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి వ్యవహారాలు ఎన్నో చోటు చేసుకున్నాయి ఇక వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జేసీ బ్రదర్స్ రాజకీయంగా, వ్యక్తిగతంగా ఎన్నో రకాల ఇబ్బందులు మొదలయ్యాయి.
వారు ప్రధాన ఆదాయ వనరు అయిన ట్రావెల్స్ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది.వీటితో పాటు వారిపై గతంలో నమోదైన అనేక కేసులలో కదలిక రావడం ఇప్పటికే జెసి ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డి జైలు పాలవడం, ఇప్పుడు దివాకర్ రెడ్డి దొలమైట్ సున్నపురాయి మైనింగ్ కు సంబంధించి అక్రమ మైనింగ్ కు పాల్పడ్డారన్న కారణంగా గనుల శాఖ ఉన్నతాధికారులు జేసి దివాకర్ రెడ్డి కి 100 కోట్ల జరిమానా విధించడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇప్పటికే వరుసగా ఎదురవుతున్న ఇబ్బందులతో సతమతమవుతున్నా, జేసీ బ్రదర్స్ కు ఇప్పుడు పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పుకోవాలి.2019 ఎన్నికల్లో జెసి వారసులు ఇద్దరూ ఎన్నికల్లో ఓడిపోవడం, టిడిపి అధికారానికి దూరం అవడం, వైసీపీ అధికారంలోకి రావడం, ఇవన్నీ వారికి ఎన్నో రకాలుగా ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.అనంతపురం జిల్లాలోని యాడికి మండలం లో డోలమైట్ సున్నపురాయి మైనింగ్ లో భారీ ఎత్తున అక్రమ మైనింగ్ జరిగిందనే విషయం ఆధారాలతో సహా నిరూపణ జరిగింది.అలాగే 14 లక్షల మెట్రిక్ టన్నుల సున్నపు రాయిని అక్రమంగా తవ్వుకున్నారు అనే అభియోగాలతో అధికారులు వంద కోట్ల జరిమానాను విధించారు.
ఒకవేళ దివాకర్ రెడ్డి ఈ జరిమానాను చెల్లించకపోతే రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆస్తులను ఎటాచ్ చేసుకునేందుకు ఇప్పటికే నోటీసులను జారీ చేశారు.అయితే ఇదంతా జేసీ బ్రదర్స్ నోటిదురుసు రాజకీయం కారణంగానే చోటు చేసుకున్నట్లు గా కనిపిస్తోంది.
ప్రస్తుత పరిణామాలను లెక్కలోకి తీసుకుంటే, జేసీ బ్రదర్స్ రాజకీయ జీవితం పూర్తిగా ఇబ్బందుల్లో పడినట్లుగా కనిపిస్తోంది.అలాగే వారు వ్యక్తిగతంగా ఎన్నో రకాలుగా నష్టాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇదంతా వారి స్వయంకృతాపరాధం అనే చర్చ నడుస్తోంది.