ప్రస్తుతం ఎంతో చదువు చదివినప్పటికీ, మూఢనమ్మకాలను ఎక్కువగా నమ్ముతున్నారు.ఎవరైనా స్వామిజీలు, బాబాలు చెప్పే మాటలు విని, లక్షల్లో మోసపోతుంటారు.
డబ్బు మొత్తం చెల్లించిన తర్వాత చివరికి మోసపోయామని గ్రహించి లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు.ఇలాంటి సంఘటన ఉత్తరప్రదేశ్ లో తాజాగా చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు… ఉత్తరప్రదేశ్ లో అనారోగ్యంతో బాధపడుతున్న సమీనా అనే మహిళకు వైద్యం చేయడానికి డాక్టర్ లాయిక్ ఖాన్ నెల రోజుల పాటు తన ఇంటికి వెళ్లి వైద్యం చేసేవాడు.ఈ నేపథ్యంలోనే తనకు తెలిసిన ఓ బాబా ఉన్నాడని, అతను ఎంతో మహిమగలవాడని, ఇంట్లో ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే,అతని దగ్గరికి వెళ్తే మంచి పరిష్కారం చూపిస్తారని,పదే పదే ఆమె చెప్పడంతో డాక్టర్ ఆ మాంత్రికుడిని కలవడానికి ఆసక్తి చూపిస్తాడు.
అక్కడ ఇస్లాముద్దీన్ అనే మాంత్రికుడు తన దగ్గర అల్లావుద్దీన్ దీపం ఉందని, దానితో ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించవచ్చని డాక్టర్ కు మాయ మాటలు చెప్పడంతో ఆ డాక్టర్ కూడా అతని మాయ మాటలు నమ్మి అల్లావుద్దిన్ దీపం అతనికి కావాలని కోరుతాడు.దీంతో ఇస్లాముద్దీన్ ఆ అద్భుత దీపాన్ని కోటి 75 లక్షలు ఇస్తే ఆ దీపం ఇస్తానని చెబుతాడు.
వీరిద్దరి మధ్య ఒక ఒప్పందం కుదరడంతో చివరకు 70 లక్షలకు అద్భుతదీపం ఇవ్వడానికి ఇస్లాముద్దీన్ ఒప్పుకుంటాడు.దీంతో డాక్టర్ ఖాన్ ఆ మాంత్రికుడి కి 70 లక్షలు చెల్లిస్తాడు. డబ్బులు చెల్లించిన దీపం ఎన్ని రోజులకు ఇవ్వకపోవడంతో తను మోసపోయానని గ్రహించిన డాక్టర్ ఖాన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి ఇస్లాముద్దీన్, అతనికి సహకరించిన అనీస్ను అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఈ దర్యాప్తులో భాగంగా సమీనా భర్త ఇస్లాముద్దీన్ అని తేలింది.వీరందరూ కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారనీ, అని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
అయితే పరారీలో ఉన్న సమీనా కోసం పోలీసులను గాలిస్తున్నట్లు తెలియజేశారు.