సాధారణంగా ఎవరైనా ఆరోగ్యం బాగా లేకనో, లేదా ఏదైనా ప్రమాదం వల్ల మరణిస్తే వారిని అంత్యక్రియలకు తీసుకెళ్లేటప్పుడు దింపుడు కళ్ళం వద్ద వారిని దించడం మన ఆచారంగా వస్తోంది.అలా దించడం వల్ల ఒకవేళ వారు ప్రాణాలతో ఉంటే అక్కడ లేస్తారని ఒక నమ్మకంతో అలా దించుతారు.
అయితే అచ్చం ఇలాంటి సంఘటనే భూపాల్ పల్లి జిల్లాలో చోటు చేసుకుంది.ఆరోగ్యం క్షీణించి,మరణించిందని తమ కూతురిని అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా దింపుడు కళ్ళం వద్ద దించగా ప్రాణాలతో ఉన్నట్లు గుర్తించారు.
పూర్తి వివరాల్లోకి వెళితే….
జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహాదేవపూర్ మండలం, కుదురుపల్లిలో నివాసముంటున్న లక్ష్మయ్య, లక్ష్మి దంపతులు వ్యవసాయ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
అయితే వీరి కుమార్తె గీతాంజలి అనే యువతి స్థానిక మహాదేవపురంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది.అయితే గీతాంజలి తీవ్రమైన జ్వరంతో గత కొద్ది రోజులుగా బాధపడుతుంది.
ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించే అంత స్తోమత లేకపోవడంతో ఆమె తల్లిదండ్రులు ఆ గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర చికిత్స చేయించారు.వీరి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో, కుటుంబపోషణ కోసం జ్వరం తో బాధపడుతూ గీతాంజలి పొలం పనులకు వెళ్ళింది.
జ్వరం తీవ్రత అధికంగా ఉండడంతో బుధవారం ఒక్కసారిగా తనలో ఎలాంటి చలనం లేకుండా పడిపోయింది.దీంతో ఆ కుటుంబ సభ్యులు గీతాంజలి మరణించిందని భావించి, ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
అంత్యక్రియలకు తీసుకెళ్తుండగా దింపుడు కళ్ళం వద్ద శవాన్ని ధించడంతో ఆమె ఒక్కసారిగా మూలగడం తో బంధువులు గీతాంజలి బ్రతికే ఉందని గ్రహించి ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.అప్పటికే చాలా ఆలస్యం కావడంతో ఆసుపత్రిలో డాక్టర్లు పరీక్షించి ఆమె మరణించిందని చెప్పారు.
దీంతో కుటుంబ సభ్యులు చేసేదేమీలేక తన శవాన్ని తిరిగి అంత్యక్రియలకు తీసుకెళ్లి, ఆ కార్యక్రమాన్ని పూర్తి చేశారు.