గే, ట్రాన్స్జెండర్స్, లెస్బియన్స్, బై సెక్సువల్స్ ఇలాంటి వ్యక్తులు, విషయాల పట్ల ఇప్పుడిప్పుడే సమాజం పరివర్తన చెందుతోంది.వారూ ఈ వ్యవస్థలో భాగం అనే భావన కలుగుతోంది.
అయితే ఇంకా చాలా చోట్ల వారి పట్ల వివక్ష బాగా ఉంది.ఇళ్లు అద్దెకు ఇవ్వడానికి కూడా జంకుతున్నారు.
అయినప్పటికి వారు పెళ్లిళ్లు చేసుకుంటూనే వున్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోనే పరిస్ధితి ఇలా వుంటే కట్టుబాట్లు, విలువలు, సాంప్రదాయాలను కట్టుదిట్టంగా అనురించే భారతదేశంలో ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు మనదేశ న్యాయవ్యవస్థను అలాంటి వివక్షను ఎదుర్కుంటున్న ఓ భారతీయ గే జంట ఆశ్రయించింది.
అమెరికాలో పెళ్లి చేసుకున్న సదరు పురుష జంట తమ వివాహానికి ఫారిన్ మ్యారేజ్ యాక్ట్, 1969 ప్రకారం గుర్తింపు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
మమ్మల్ని దంపతులుగా గుర్తించండి అంటూ వారు కోరుతున్నారు.పిటిషనర్లలో ఒకరు భారతీయ పౌరుడు కాగా, మరొకరు భారత దేశపు ఓవర్సీస్ పౌరుడు. 2017లో తామిద్దరం అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో పెళ్ళి చేసుకున్నామని ఈ జంట పిటిషన్లో పేర్కొంది.2020 మార్చి 5న తమ వివాహం నమోదు కోసం న్యూయార్క్లోని ఇండియన్ కాన్సులేట్ను సంప్రదించామని తెలిపింది.అయితే తాము స్వలింగ వివాహం చేసుకున్న కారణం చేత తమ దరఖాస్తును అధికారులు తిరస్కరించారని వారు హైకోర్టుకు మొరపెట్టుకున్నారు.
చట్టప్రకారం తమ దరఖాస్తును తిరస్కరించడం భారత రాజ్యాంగంలోని అధికరణలు 14, 15, 19, 21లను ఉల్లంఘించడమేనని ఆరోపించారు.
నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకునే హక్కు భారత రాజ్యాంగంలోని అధికరణ 21లో అంతర్నిహితంగా ఉందని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో తెలిపిందని అన్నారు.కాగా, జస్టిస్ నవీన్ చావ్లా ధర్మాసనం ముందుకు గురువారం ఈ పిటిషన్ రాగా.
దానిని వేరొక ధర్మాసనానికి బదిలీ చేశారు.దీనిపై వచ్చే వారం విచారణ జరిగే అవకాశాలున్నాయి.
మరోవైపు స్వలింగ సంపర్కానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చినప్పటికీ, స్వలింగ వివాహాలకు మాత్రం అనుమతి ఇవ్వకూడదని కేంద్రం నిర్ణయం తీసుకుంది.స్వలింగ వివాహాలను గుర్తించి నమోదు చేయాలని కోరుతూ గత నెలలో ఢిల్లీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ను భారత ప్రభుత్వం వ్యతిరేకించిన సంగతి తెలిసింది.
మన చట్టం, సమాజం, విలువలు స్వలింగ వివాహాన్ని గుర్తించవని కేంద్రం హైకోర్టుకు నివేదించింది.