పరిపాలనా పరంగా చూసుకున్నా, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న తీరును లెక్కలు వేసుకున్నా, ఏపీలో అమలవుతున్నంత స్థాయిలో సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రాల్లోనూ అమలు కావడం లేదు.దీనికి ఏపీ సీఎం జగన్ చిత్తశుద్ధి కారణం అని ఆ పార్టీ చెప్పుకుంటోంది.
ఎన్నికలకు ముందు జగన్ చేపట్టిన పాదయాత్ర సమయంలో, స్వయంగా ప్రజల కష్టాలు స్వయంగా చూడడంతో, ఈ మేరకు ఆయన ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు.ఆ పథకాలను అమలు చేయడం తలకు మించిన భారం అయినా, జగన్ దానిని పట్టించుకోకుండా, అమలు చేసి చూపిస్తున్నారు.
అయితే ఆర్థికంగా ప్రభుత్వ ఖజానా సరిపోకపోయినా, అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలకు నిధులను మళ్లీస్తున్నారు.
జగన్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలంలో చేసిన అప్పులు చూస్తుంటే, రానున్న రోజుల్లో మరిన్ని అప్పులు చేయాల్సి వస్తుందనే భయం అందరిలోనూ నెలకొంటోంది.
కరోనా కష్టకాలంలో జనాల ఖాతాల్లోకి సొమ్ములు జమ చేసి జగన్ ప్రజల కష్టాలను తీర్చాడు.ఈ విషయంలో జగన్ ను తప్పు పెట్టేందుకు అవకాశం లేకపోయినా, మిగతా అభివృద్ధి పనుల విషయంలో నిధుల కొరత కారణంగా అవన్నీ పెండింగ్ పడిపోవడం, ఈ కారణంగా నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు లేక ఎమ్మెల్యేలు ఇబ్బంది పడడం , అభివృద్ధి పనుల నిమిత్తం ప్రజల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నా, ఎటువంటి హామీ ఇవ్వలేకపోవడం వంటి కారణాలతో ఎమ్మెల్యేలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీంతో తమ సమస్యలను జగన్కు చెప్పుకుందాం అనుకుంటున్నా, చాలా మంది ఎమ్మెల్యేలకు ఆయన అపాయింట్మెంట్ దొరకడం లేదు.దొరికినా, వారు నిధులు మంజూరు చేయవలసిందిగా జగన్ కు ప్రతిపాదిస్తున్నా, పెద్దగా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. అభివృద్ధి సంక్షేమ పథకాలకు శంకుస్థాపన చేసి చాలా కాలం అయింది అని , ఉన్న నిధులన్నీ సంక్షేమ పథకాలకు ఖర్చు చేస్తున్నారని , కొత్త అప్పులు తెచ్చి మరీ వాటికి మొత్తం వెచ్చిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు, రోడ్ల నిర్మాణాలు వంటి వాటి విషయంలో ప్రజల్లో అసంతృప్తి పెరిగిపోతుందని ఎమ్మెల్యేలు బాధ లో ఉన్నారు.
జగన్ పరిపాలనా కాలంలో తొలి ఐదు నెలల్లోనే ప్రభుత్వం 85 వేల కోట్ల నిధులు సేకరించగా, అందులో 47 వేల కోట్లు రుణాల ద్వారా సేకరించింది.
ఇప్పటికి రాష్ట్రానికి సరైన ఆదాయం వనరులు లేకపోవడంతో, జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కావాలంటే మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సిందే.అలా చేస్తూనే ఉండాల్సిందే.సంక్షేమ పథకాలకే నిధులు మొత్తం ఖర్చుపెట్టకుండా అభివృద్ధి పనులపైన దృష్టిపెట్టి నిధుల కొరతను అధిగమించడం పై జగన్ దృష్టి సారించి, అన్నిటినీ బ్యాలెన్స్ చేయాలనే సూచనలు ఇప్పుడు జగన్ కు పెద్ద ఎత్తున అందుతున్నాయి.