మన దగ్గర పనిచేసే వారికి కూడు, గూడు, గుడ్డ ఇచ్చి యోగక్షేమాలు పట్టించుకోవడం యజమాని బాధ్యత.అవేవి ఇవ్వలేకపోయినా కనీసం సమయానికి వేతనాలైనా ఇస్తే అంతకు మించిన మంచి పని మరొకటి లేదు.
కానీ అమెరికాలో స్థిరపడిన ఓ భారతీయ జంట మాత్రం కార్మికుల పట్ల అమానుషంగా ప్రవర్తించి, వారిని నరకయాతనకు గురిచేసింది.రోజుకు 18 గంటల పాటు పని చేయించుకుని, వారికి ఎలాంటి వేతనాలు చెల్లించకపోగా, వేధింపులకు పాల్పడ్డారు.
ఇందుకు సంబంధించిన నేరం రుజువు కావడంతో న్యాయస్థానం యజమానురాలికి 15 ఏళ్ల జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.
శర్మిస్తా బరై, సతీష్ కర్తాన్ అనే భారతీయ దంపతులు కాలిఫోర్నియాలోని స్టాక్టన్లో నివాసం వుంటున్నారు.వీరు తమ ఇంట్లో పనిమనుషులు కావాలని అమెరికాలో భారతీయ పత్రికలు, వెబ్సైట్లలో ప్రకటనలు ఇచ్చారు.
అందులో ప్రకటించిన వేతనం, పనివేళలు కాకుండా రోజుకు 18 గంటల పాటు పనిచేయించుకున్నారు.వేతనాలు అడిగిన కార్మికులపై బెదిరింపులకు పాల్పడేవారు. ఈ క్రమంలో బరై దంపతులపై 2019లో కార్మిక ఉల్లంఘనలకు పాల్పడినందుకు కేసు నమోదైంది.బలవంతంగా కార్మికులను నియమించుకోవడం, వారిపై వేధింపులకు పాల్పడటం కింద వీరిపై నాలుగు అభియోగాలు మోపారు.
అదే ఏడాది మార్చి 14న ఈ కేసును ఫెడరల్ కోర్టు విచారించింది.తాజాగా మరోసారి విచారించిన న్యాయస్థానం బరై దంపతులను దోషిగా తేల్చింది.తాజాగా శర్మిస్తా బరైకి 15 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది.ఈ కేసులో ఆమె భర్త సతీశ్ కర్తాన్కు ఈ నెల 22న శిక్ష ఖరారు చేయనుంది.