టిఆర్ఎస్ లో కేసీఆర్ మేనల్లుడు, మంత్రి హరీష్ రావు ప్రాబల్యం పెరిగినట్టుగా కనిపిస్తోంది.ఆపార్టీ ట్రబుల్ షూటర్ గా ఆయనకు మొదటి నుంచి మంచి పేరు ఉంది.
పార్టీ ఎక్కడైనా ఇబ్బందులు పడినా, నాయకులు అసంతృప్తుకి గురైనా, వారిని బుజ్జగించడం, పార్టీలోకి చేరికలు ప్రోత్సహించడం, రాజకీయ ప్రత్యర్ధులకు అవకాశం లేకుండా రాజకీయాలు చేయడం, ఇలా అన్నిటిలోనూ బాగా ఆరితేరిపోయారు.అయితే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం కేటీఆర్ కు పోటీ వస్తాడేమో అన్న ఉద్దేశంలో హరీష్ ను పట్టించుకోనట్లు కేసీఆర్ వ్యవహరించారు.
దీంతో హరీష్ బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం అప్పట్లో నడిచింది.కానీ అదంతా ఒట్టి పుకారే అని ఆ తరువాత అందరికీ అర్థమైంది. కాస్త ఆలస్యంగా అయినా, హరీష్ రావుకు కేసీఆర్ మంత్రి పదవి కట్టబెట్టారు.కొద్ది రోజులుగా ఆయన పార్టీలో యాక్టివ్ గా ఉంటూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో దుబ్బాకలో టిఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి.ఇక్కడ గెలుపు టిఆర్ఎస్ కు ప్రతిష్టాత్మకం కావడం, స్థానికంగా టిఆర్ఎస్ కు కాస్త వ్యతిరేకత ఈ నియోజకవర్గంలో ఉండడం, ఇవన్నీ పరిగణలోకి తీసుకుని కేసీఆర్ ఇప్పుడు ఈ నియోజకవర్గం గెలుపు బాధ్యతలను మంత్రి హరీష్ రావు కు అప్పగించారు.
సిద్దిపేట నియోజకవర్గం ఉన్న దుబ్బాక జిల్లాలో హరీష్ రావుకి పూర్తిగా పట్టు ఉంది.దీంతో ఈ వ్యవహారాన్ని హరీష్ చక్కబెడుతున్నారు.
దుబ్బాక నియోజకవర్గంలోని సర్పంచులకు, నాయకులకు తరచుగా హరీష్ స్వయంగా ఫోన్ చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.ప్రస్తుతం ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకం కావడంతో, దుబ్బాక నియోజకవర్గంలో ఉన్న ఒక్కో మండలానికి ఒక్కో ఎమ్మెల్యేను ఇన్చార్జిగా నియమించారు.అలాగే నియోజకవర్గానికి సంబంధించి పెండింగ్ లో ఉన్న అన్ని పనులను వెంటనే చేపడుతూ, నియోజక వర్గానికి అవసరమైన అన్ని పనులు వేగవంతం చేశారు.అలాగే ఇక్కడ సొంత పార్టీలో ఉన్న గ్రూపు విభేదాలపైన దృష్టి సారించి, వాటిని చక్కబెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రస్తుతం ఇక్కడ సోలిపేట రామలింగారెడ్డి భార్యకు టికెట్ కేటాయించబోతున్న నేపథ్యంలో ఇదే స్థానాన్ని ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కుమారుడుని టిఆర్ఎస్ బుజ్జగిస్తోంది.
తమకు గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉన్న బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు కదలికలపైన దృష్టి సారించి, ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ అప్పుడే ఎన్నికల వాతావరణాన్ని దుబ్బాకలో తీసుకువస్తున్నారు.
ఇక్కడ గెలుపు టిఆర్ఎస్ కు మాత్రమే కాకుండా, హరీష్ కు సైతం ప్రతిష్టాత్మకం కావడంతో అధికార పార్టీ గట్టిగానే కష్టపడుతోంది.