దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.అన్ లాక్ నిబంధనలు సడలించటంతో దేశంలో సాధారణ పరిస్థితులు ఏర్పడటంతో పాటు అదే సమయంలో కేసులు పెరుగుతున్నాయి.
వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ ను కట్టడి చేయడం సాధ్యమవుతుందని వైద్యులు, శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.వైరస్, వ్యాక్సిన్ పై ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.
తాజాగా శాస్త్రవేత్తలు కొత్త తరహా ప్రయోగం చేసి ఆ ప్రయోగం ద్వారా వైరస్ ను అడ్డుకోవచ్చని చెబుతున్నారు.ప్రస్తుతం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా వ్యాక్సిన్ ను తయారు చేసి ఆ వ్యాక్సిన్ ద్వారా యాంటీబాడీలు ఉత్పత్తి అయ్యేలా ప్రయోగాలు చేస్తున్నారు.
అయితే జర్మనీ శాస్త్రవేత్తలు మాత్రం ఇప్పటికే గుర్తించిన యాంటీబాడీల ద్వారా వ్యాక్సిన్ ను తయారు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.
జర్మనీ శాస్త్రవేత్తలు ఎక్కువ సామర్థ్యంతో కరోనాపై మెరుగైన ఫలితాలను చూపే యాంటీబాడీలను గుర్తించారు.
ఈ యాంటీబాడీలతో వ్యాక్సిన్ ను తయారు చేస్తే మెరుగైన ఫలితాలను సాధిస్తుందని పేర్కొన్నారు.సెల్ జర్నల్ తాజా సంచికలో యాంటీబాడీలతో తయారు చేసే వ్యాక్సిన్ కు సంబంధించిన ఫలితాలు ప్రచురితమయ్యాయి.
సెంటర్ ఫర్ న్యూరో డీజనరేటివ్ శాస్త్రవేత్తలు కరోనా నుంచి కోలుకున్న వారి నుంచి యాంటీబాడీలు సేకరించి ఈ పరిశోధనలు చేపట్టారు.
కృత్తిమంగా యాంటీబాడీలను తయారు చేసి వ్యాక్సిన్ రూపంలో పంపించడం వల్ల శరీరంలోకి ప్రవేశించిన వైరస్ ను యాంటీబాడీలు సులువుగా అడ్డుకోగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఇప్పటికే జంతువులపై చేసిన పరిశోధనల్లో మంచి ఫలితాలు సాధించామని.మానవులపై పరిశోధనలు చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.మరోవైపు శాస్త్రవేత్తల పరిశోధనలు అనుకూల ఫలితాలు సాధిస్తూ ఉండటంతో త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఈ సంవత్సరం చివరినాటికి కరోనా మహమ్మారికి కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.