కాలం తో పాటు మనుషులు మారాలి అని పెద్దలు అంటూ ఉంటారు.కానీ కొంత మంది మాత్రం ఎన్ని సంవత్సరాలు గడిచినా వారి మూర్ఖత్వాలు మాత్రం మార్చుకోవడం లేదు.
పొరుగుదేశం పాకిస్థాన్ లో దారుణమైన రీతిలో పరువు హత్య చోటుచేసుకుంది.ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడిందన్న కోపంతో పదేళ్ల తరువాత ఆ మహిళను దారుణమైన రీతిలో మేనల్లుడితో కాల్చి చంపించిన ఘటన సంచలనం సృష్టించింది.
అయితే ఇంతకీ ఆ మేనల్లుడి వయసు 9 ఏళ్లే కావడం మరింత కలకలం రేపింది.లాహోర్ కు 200 కిలోమీటర్ల దూరంలో సర్గోదా గ్రామానికి చెందిన మహిళ పదేళ్ల కిందట ప్రేమ వివాహం చేసుకుంది, కుటుంబ సభ్యులకు ఇష్టంలేకపోయినా, తన ప్రియుడ్ని పెళ్లాడి అతడితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంది.
ఈ క్రమంలో ఆమెకు ముగ్గురు పిల్లలు కూడా కలిగారు.అయితే తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నందుకు ఆమెపై కుటుంబ సభ్యులు కసితో రగిలిపోయారు.
అయితే ఇటీవల కొంతకాలంగా ఆ మహిళతో కుటుంబ సభ్యులు సత్సంబంధాలు కొనసాగిస్తుండడం తో ఆమె సంతోషానికి అవధులు లేకుండా పోయింది.అయితే సత్సంబంధాల చాటున వారి పన్నాగం ఆమె గ్రహించలేకపోయింది.
ఆమెపై ఆప్యాయత చూపుతున్నట్లు నటించి ఇంట్లో శుభకార్యం ఉందంటూ ఆహ్వానించడం తో ఆమె ఆనందం గా పుట్టింటికి గంపెడు ఆశతో అడుగుపెట్టింది.కానీ ఇంటికి పిలిచిన సొంత అన్నే తన 9 ఏళ్ల కుమారుడికి తుపాకీ ఇచ్చి మరి కాల్చమని చెప్పడం తో ఆ బాలుడు మేనత్త పై పలు రౌండ్లు కాల్పులు జరిపాడు.
దాంతో ఆమె సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచింది.పోలీసులకు సమాచారం అందడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అయితే ఈ ఘటన తర్వాత ఆమె అన్న కుటుంబం అక్కడ నుంచి పారిపోయినట్లు తెలుస్తుంది.అయితే ఆ బాలుడికి గత కొన్నిరోజులుగా తుపాకీ పేల్చడంలో శిక్షణ ఇస్తున్నా, దానివెనుక కుట్ర దాగి వుందని గుర్తించలేకపోయారు.
మరోపక్క ఈ ఘటనతో పాక్ లో మానవ హక్కుల సంఘాలు భగ్గుమన్నాయి.పలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.