అమెరికాలో త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ఇరు పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి.వాడి వేడి చర్చలు, ప్రజా వేదికలు, సభలు నిర్వహిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు.
గెలుపు పై ఎవరికి వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇక బిడెన్ ఎలాగైనా అధ్యక్షుడిగా గెలవాలని, ఒక్క సారి అధ్యక్ష పీటంపై ఉండాలని పట్టుబడుతున్నారు.
ఈ నేపధ్యంలోనే డెమోక్రటిక్ పార్టీకి గత ఎన్నికల్లో ఎక్కువగా ఓట్లు నమోదు కాని ప్రాంతాలపై ఆయన దృష్టి పెట్టారు.అంతేకాదు ట్రంప్ కి కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ ట్రంప్ ని వెనక్కి నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ట్రంప్ గత ఎన్నికల్లో విజయం సాధించిన విస్కాన్సిన్ రాష్ట్రంలో ప్రచారం చేపట్టిన బిడెన్ అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.అంతేకాదు ట్రంప్ పిరికి వాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కరోనా వల్ల అమెరిక రాష్ట్రం అతలాకుతలం అయ్యిపోవడానికి ప్రధాన కారణం కేవలం ట్రంప్ నిర్లక్ష్య వైఖరేనని, దేశ ప్రజల ప్రాణాలు గాలికి వదిలేసిన ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగడానికి ఏ మాత్రం అర్హత లేదని వ్యాఖ్యానించారు.అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకూ సుమారు 68 లక్షల కరోనా కేసులు పెరిగిపోయాయని, సుమారు 2 లక్షల మంది చనిపోయారని దీనికి కారణం ట్రంప్ కాదా అంటూ ప్రశ్నించారు.
పరిస్థితి ఇలా ఉన్నా సరే కరోనాని నియంత్రించడంలో ట్రంప్ ప్రభుత్వం భయపడిపోతోందని అన్నారు.కరోనా తో కలిసి మనం ఇంతకాలం జీవనం సాగించడం తలుచుకుంటూనే బాధగా ఉందని, మన దేశ పౌరుడు మనముందే ప్రాణాలు కోల్పోతున్నా చూస్తూ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఈ పరిస్థితికి కారణం ట్రంప్ చేతకాని తనమేనని అన్నారు.
అయితే బిడెన్ ఏకంగా ట్రంప్ కంచుకోటలో బిడెన్ వాడి వేడి ప్రసంగాలు చేసినా స్థానిక ప్రజలనుంచీ పెద్దగా స్పందన లేదని స్థానిక మీడియా ప్రకటించింది.