ఏపీలో అసలు కాంగ్రెస్ పార్టీ ఉందా లేదా అనే అనుమానం ఇప్పుడు అందరిలోనూ మొదలైంది.చెప్పుకోడానికి జాతీయ పార్టీ అయినా, ఇక్కడ మాత్రం ఆ పార్టీ ఉనికి ఉన్నట్టుగానే కనిపించడం లేదు.
ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత ఏపీ లో కాంగ్రెస్ పూర్తిగా కుదేలయింది.అన్యాయంగా ఆంధ్ర, తెలంగాణను విడదీశారు అనే కోపం ప్రజలలోను బలంగా వెళ్లిపోవడంతో, 2014 , 2019 ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క స్థానం కూడా దక్కించుకోలేకపోయింది.
అసలు కాంగ్రెస్ కు ఈ స్థితి వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు.పార్టీ నాయకుల్లో నిరాశ, నిస్పృహలు అలుముకున్నాయి.
దీంతో నాయకులు ఎవరికి వారు ఇతర పార్టీలు చేరిపోగా, కొంత మంది రాజకీయ నాయకులు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో ఉండిపోయారు.వీరంతా పార్టీలోనే ఉన్నా, అంత యాక్టివ్ గా అయితే లేరు.
ఏదో ఉన్నాము అని చెప్పుకోవడానికి తప్ప వీరు పార్టీకి ఉపయోగపడడం కానీ, పార్టీ వీరికి ఉపయోగపడడం కానీ లేదు.ఇక కాంగ్రెస్ లో కీలక పదవులు అనుభవించిన నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు ఇలా ఎవరికి వారు తమ సొంత వ్యవహారాలపైనే ఎక్కువగా దృష్టి పెట్టి పార్టీని గాలికి వదిలేసినట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఎప్పుడైనా ఏదైనా సందర్భం వస్తే తప్ప, మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఎవరూ పెద్దగా ఇష్టపడడం లేదు.దీంతో అసలు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఉందా అనే అనుమానాలు కూడా అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి.
ప్రస్తుతం ఏపీలో ఏ సంఘటన జరిగినా, వైసీపీ ప్రభుత్వం పై బిజెపి, జనసేన, వామపక్ష పార్టీలు మాత్రమే పోరాటం చేస్తూ మీడియాలోనూ హడావుడి చేస్తున్నాయి తప్ప, ఎక్కడా, ఏ విషయం పైన కాంగ్రెస్ నాయకులు మాత్రం నోరు విప్పడం లేదు.ఆ పార్టీ పరిస్థితి చూస్తే, 2024 నాటికి అసలు ఆ పార్టీ తరఫున పోటీ చేసేవారు ఉంటారా ? అసలు ఇక్కడ ఆ పార్టీ ఉనికి లో ఉంటుందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఏపీ పీసీసీ అధ్యక్షుడిగా శైలజానాథ్ మాత్రమే ఎప్పుడైనా, ఏదో ఒక సందర్భంలో స్పందిస్తున్నారు తప్ప, మిగతా నాయకులు ఎవరు పెద్దగా యాక్టివ్ గా లేరు.
ఏపిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పూర్తిగా రాజకీయాల నుంచి వైదొలిగినట్టుగా వ్యవహరిస్తున్నారు.
ఆయన వ్యవసాయం పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు.ఇక కేంద్ర మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నాయకులు పళ్ళంరాజు, జె.డి.శీలం, చింతామోహన్, కనుమూరి బాపిరాజు ఇలా ఎవరికి వారు పూర్తిగా సైలెంట్ అయిపోయారు.దీంతో అరకొరగా ఉన్న పార్టీ క్యాడర్ కూడా ప్రత్యామ్నాయంగా వేరే పార్టీ లో చేరిపోతున్నారు.ప్రస్తుతం నాయకుల వ్యవహారం చూస్తుంటే, ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ముగిసిన అధ్యయనమే అనే అభిప్రాయం కలుగుతోంది.