దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెరుగుతోంది. కరోనా, లాక్ డౌన్ వల్ల కోట్ల సంఖ్యలో ఉద్యోగులు ఉద్యోగాలు కోల్పోయి ఇంటికే పరిమితమయ్యారు.
కొత్త ఉద్యోగాల కల్పన మాట అటుంచితే ఉన్న ఉద్యోగాలే ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ రంగంలో పని చేసే ఉద్యోగులు ఉద్యోగ భద్రత లేకపోవడంతో బిక్కుబిక్కుమంటూ జీవనం గడుపుతున్నారు.
కుటుంబ పోషణ కోసం అప్పులపై ఆధారపడుతున్నారు.
అయితే ఇదంతా నాణేనికి ఒకవైపు.
మరోవైపు కొందరు తమ తెలివి, ప్రతిభ, కృషితో కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఉత్తరాఖండ్కు చెందిన 22 సంవత్సరాల యువతి దివ్య రావత్ పుట్టగొడుగుల పెంపకం ద్వారా కోట్ల రూపాయలు సంపాదిస్తోంది.
ఇతర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగం చేయడం కంటే ఉన్న ప్రాంతంలోనే డబ్బు సంపాదించాలనే ఆలోచన చేసి కోట్ల రూపాయలు తన ఖాతాలో వేసుకుంటోంది.
ఢిల్లీలోని అమిటీ విశ్వవిద్యాలయంలో మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చదివిన దివ్య మొదట ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది.
అక్కడ ఆమెకు మంచి జీతమే వచ్చేది.అయితే ఆమెకు చేసే పని ఎందుకో సంతృప్తిని ఇవ్వలేదు.దీంతో మరో ఉద్యోగానికి మారింది.అయితే అక్కడ కూడా దివ్యకు తను వెతుక్కునే సంతృప్తి లభించలేదు.
దీంతో చాలా ఉద్యోగాలు మారిన తరువాత తనకు కొత్తగా ఏదైనా చేయాలనిపించి సొంతూరికి తిరిగొచ్చేసింది.
ఉత్తరాఖాండ్ రాష్ట్రంలో 10 జిల్లాల్లో 55 యూనిట్లను ఏర్పాటు చేసి దివ్య పుట్టగొడుగుల ద్వారా వందలాది మందికి ఉపాధి కల్పిస్తోంది.
ఈమెను ఆ రాష్ట్రంలో అందరూ మష్రూమ్ గర్ల్ అని పిలుస్తారు.ఈమె సంవత్సరానికి రెండు కోట్లకు పైగా సంపాదిస్తోందని తెలుస్తోంది.ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమెను పుట్టగొడుగులకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది.నిరుద్యోగులకు స్పూర్తిగా నిలుస్తున్న దివ్యను అందరూ ప్రశంసిస్తున్నారు.
ఆ రాష్ట్ర మంతటా దివ్య పేరు మారుమ్రోగిపోతుంది.