ఏపీలో రాజకీయాలు ఎప్పుడు హాట్ హాట్గానే నడుస్తుంటాయి.అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతుంటుంది.
ఎలాంటి అంశమైనా ఈ రెండు పార్టీల మధ్య రాజకీయం నడవాల్సిందే.ఇక ఈ రాజకీయంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకోవడం, కౌంటర్లు ఇవ్వడం జరుగుతాయి.
తాజాగా కూడా ఏపీ ప్రభుత్వ సలహాదారుడు నారా లోకేష్ని ఉద్దేశించి కాస్త ఘాటు వ్యాఖ్యలే చేశారు.తాజాగా సిఎన్జి గ్యాస్పై ఏపీ ప్రభుత్వం వ్యాట్ పెంచింది.
అయితే నారా లోకేష్ ఎల్పిజి గ్యాస్కు సంబంధించి ట్వీట్ చేశారు.మహిళలకు ఆసరా ఇచ్చి, ఇప్పుడు గ్యాస్ ధరలు పెంచి టోకరా వేశారని మాట్లాడారు.
ఈ వ్యాఖ్యలపై సజ్జల మాట్లాడుతూ… లోకేష్ ఎంత చదువుకుని ఏమి ఉపయోగమని, సీఎన్జీ, ఎల్పీజీకి కూడా తేడా తెలియడం లేదా ? అని అన్నారు.లోకేష్కు తెలుగు కూడా సరిగ్గా మాట్లాడటం రాదని మాట్లాడారు.
ఇక సజ్జల ఇలా మాట్లాడాక టీడీపీ నేతలు ఊరుకుంటారా…వారు కూడా సజ్జలకు గట్టిగానే కౌంటర్లు ఇస్తున్నారు.సజ్జల ఈ మధ్య జగన్ రెడ్డి వదిలిన రికార్డెడ్ వీడియోలు చూసినట్టు లేరని, తెలుగుకే తెగులు పట్టిస్తూ జగన్ మాట్లాడుతున్న తెలుగు చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని, ముందు సజ్జల రెడ్డి జగన్ రెడ్డికి అ,ఆ లు నేర్పాలి, ఆ తరువాత 10 మంది జర్నలిస్టుల ముందు కూర్చోబెట్టి లైవ్లో మాట్లాడించాలని టీడీపీ నేతలు కౌంటర్లు వేస్తున్నారు.
వాస్తవానికి నారా లోకేష్ తెలుగు మాట్లాడటంలో వీక్ అని అందరికీ తెలుసు.గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆయన తెలుగు మాట్లాడటం సరిగ్గారాక నవ్వులు పాలైన విషయం తెలిసిందే.కొన్నిసార్లు ఆయనే తెలుగు పలకడం రాదని ఒప్పుకున్నారు.కానీ తర్వాత తర్వాత లోకేష్ మాట్లాడే విధానం మార్చుకున్నారు.ప్రస్తుతం మీడియా సమావేశాల్లో బాగానే మాట్లాడుతున్నారు.అయితే జగన్ పాదయాత్ర సమయంలో అనర్గళంగా స్పీచ్లు ఇచ్చారు.
కానీ సీఎం అయ్యాక మీడియా సమావేశాల్లో, సభల్లో తెలుగుని చాలాసార్లు తప్పుగానే మాట్లాడారు.ఇప్పుడు ఇదే తెలుగు తమ్ముళ్ళకు అస్త్రంగా మారింది.
మొత్తానికైతే తెలుగు మాట్లాడే విషయంలో మొన్నటివరకు లోకేష్ టార్గెట్ అయితే, ఇప్పుడు జగన్ టార్గెట్ అవుతున్నారు.