ఏపీలో కరోనా వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.రోజూ పదివేలకు తగ్గకుండా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ఇప్పటికే చాలా మంది ప్రాణాలను కరోనా మహమ్మారి బలి తీసుకుంది.ప్రభుత్వం ఎన్ని జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నప్పటికీ సామాన్య ప్రజల నుంచి రాజకీయ నాయకుల వరకు ఈ వైరస్ సోకుతూనే ఉంది.
ఇప్పటికే రాష్ట్ర నాయకులు చాలా మంది కరోనా బారిన పడ్డారు.కొందరు హోం క్వారంటైన్ లో ఉంటూ చికిత్స పొందుతుండగా.
మరికొందరు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకుంటున్నారు.దీంతో రాజకీయ నాయకుల్లో కరోనా భయం వెంటాడుతోంది.
తాజాగా వైసీపీ పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి కరోనా పాజిటివ్ వచ్చింది.గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కరోనా లక్షణాలు రావడంతో స్థానిక ఆస్పత్రిలో కరోనా పరీక్షలు చేయించుకున్నారు.
రిపోర్టుల్లో పాజిటివ్ రావడంతో కుటుంబ సభ్యులు ఆయనను అపోలో ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.ఈ మేరకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు.కాగా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు జిల్లా రూరల్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.రోజూ ప్రజల సమస్యలను తీర్చేందుకు నిత్యం ప్రజలకు అందుబాటులో, పార్టీ కార్యకర్తలతో కలిసి ఉంటారు.
అయితే శ్రీధర్ రెడ్డికి పాజిటివ్ రావడంతో వారం రోజులుగా ఆయనతో కాంటాక్ట్ లో ఉన్నవారు కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.