తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాల్లో క్రూరమైన విలన్ గా సోనూసూద్ కు పేరుంది.అయితే నిజ జీవితంలో మాత్రం సోనూసూద్ వేరు.
లాక్ డౌన్ సమయంలో సోనూసూద్ చేసిన సహాయాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.కోట్లకు కోట్లు పారితోషికం తీసుకుంటున్న స్టార్ హీరోలు సైతం పేదలకు సహాయం చేయడానికి వెనుకడుగు వేస్తుంటే ఎలాంటి కష్టమొచ్చినా తానున్నానంటూ సహాయం చేస్తూ రియల్ లైఫ్ లో రియల్ హీరోగా సోనూసూద్ ప్రశంసలందుకుంటున్నారు.వలస కార్మికుల కోసం సహాయం చేసినా, సోషల్ మీడియాలో పేదలు పడుతున్న కష్టాలను తీర్చడంలోనైనా సోనూసూద్ రూటే వేరని చెప్పాలి.తాజాగా సోనూ మరో సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
పేద విద్యార్థులకు తన తల్లి సరోజ్ సూద్ పేరుతో స్కాలర్ షిప్ లు అందించటానికి సిద్ధమవుతున్నాడు.సోనూ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల నెటిజన్ల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
సోనూసూద్ స్కాలర్ షిప్ పొందాలనుకునేవాళ్లు [email protected] ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించాడు.
దేశంలో ఇతర రంగాలతో పోలిస్తే కరోనా, లాక్ డౌన్ వల్ల విద్యా రంగం తీవ్రంగా నష్టపోయింది.సోనూ విద్యా రంగం గురించి స్పందిస్తూ చాలామంది విద్యార్థుల దగ్గర ఆన్ లైన్ క్లాసులకు హాజరు కావడానికి ఫోన్లు కూడా లేవని… పేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు పిల్లలను ఉన్నత చదువులు చదివించటం కొరకు పడుతున్న కష్టాలు తనకు తెలుసని… పలు యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకుని విద్యార్థులకు సాయం చేసే దిశగా అడుగులు వేస్తున్నానని చెప్పారు.
తన తల్లి వీలైతే విద్యార్థులకు సాయం చేయాలని తనకు సూచించారని… ఆమె ఉచితంగా పిల్లలకు పాఠాలు చెప్పేవారని… కుటుంబ వార్షికాదాయం 2 లక్షల రూపాయల కంటే తక్కువ ఉన్నవాళ్లు స్కాలర్ షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చని సోనూ తెలిపారు.తన తల్లి చూపిన మార్గంలోనే తాను వెళుతున్నానని… గమ్యం దూరంగా కనిపించినా ఖచ్చితంగా చేరుకుంటానని పేర్కొన్నారు.
ఈ స్కాలర్ షిప్ అందుకోవడానికి ఒకే ఒక్క షరతు ఉందని అది విద్యార్థి మంచి మార్కులు తెచ్చుకోవడమేనని సోనూ పేర్కొన్నారు.