సాధారణంగా అధికార పార్టీలోకి ఇతర పార్టీల నేతలు వలసలు రావడం సహజమే.కొందరు నేతలు అధికారం ఎటు ఉంటే అటు జంప్ అయిపోతారు.
అలాగే అధికారంలో ఉన్న పార్టీలు ప్రతిపక్ష పార్టీని వీక్ చేయాలనే ఉద్దేశంతో నేతలకు గేలం వేసి మరీ లాగేస్తుంది.గత ఐదేళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు కూడా ఆ పనిచేశారు.
వరుస పెట్టి వైసీపీ నేతలనీ లాగేశారు.అలాగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలని టీడీపీలోకి తీసుకొచ్చారు.23 మంది ఎమ్మెల్యేలని టీడీపీలోకి తీసుకొచ్చి అందులో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చిన విషయం తెలిసిందే.అయితే ఇప్పుడు అధికారం వైసీపీకి వచ్చింది.
దీంతో అప్పుడు టీడీపీలోకి వెళ్ళినవారు మళ్ళీ రివర్స్లో వైసీపీలోకి వచ్చేస్తున్నారు.
వీరిలో కొందరు ఎన్నికల ముందే జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
మరి కొందరు ఎన్నికల తర్వాత టర్న్ అవుతున్నారు.ఇలా చాలామంది తిరిగి వైసీపీలోకి వచ్చారు.
అయితే మంత్రి పదవులు దక్కించుకున్న నలుగురులో ఆదినారాయణరెడ్డి బీజేపీలోకి వెళ్లారు.ఈయన మొన్న ఎన్నికల్లో టీడీపీ తరుపున కడప ఎంపీగా పోటీ చేసి ఓడిపోయి బాబుకు షాక్ ఇచ్చేశారు.
అటు బొబ్బిలి నుంచి ఓడిపోయిన మాజీ మంత్రి సుజయకృష్ణరంగరావు అసలు ఏపీ పోలిటికల్ స్క్రీన్పైనే కనిపించడం లేదు.కానీ మరో ఇద్దరు మాజీ మంత్రులు అమర్నాథ్ రెడ్డి, భూమా అఖిలప్రియలు మాత్రం టీడీపీలో దూకుడుగా పనిచేస్తున్నారు.
అప్పుడు జగన్కు హ్యాండ్ ఇచ్చిన ఈ ఇద్దరు, ఇప్పుడు చంద్రబాబుకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు.
వాస్తవానికి చెప్పాలంటే కర్నూలు జిల్లాలో టీడీపీలో ఒక్క అఖిలప్రియనే బాగా యాక్టివ్గా ఉంటున్నారు.సోషల్ మీడియాలో దూకుడుగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు.కర్నూలు జిల్లాలో ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్నారు.
మహామహులు, రాజకీయ ఉద్దండులు ఉన్న కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ నేతలను ఓ మహిళా నేతగా ప్రతిపక్షంలో ఉండి అఖిల గట్టిగానే ఢీకొడుతోన్న వాతావరణమే కనిపిస్తోంది.
అటు చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డి సైతం బాగానే పనిచేస్తున్నారు.
జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేయడంలో అమర్నాథ్ ముందున్నారు.జిల్లాలో వైసీపీ నేతల అక్రమాలపై కూడా పోరాడుతున్నారు.
చంద్రబాబు సొంత జిల్లాలో చాలా మంది టీడీపీ నేతలు కాడి కింద పడేసినా అమర్నాథ్ మాత్రం తన సొంత నియోజకవర్గం పలమనేరుతో పాటు అధికార పార్టీ అక్రమాలు, అవినీతిపై పోరాటాలు చేస్తున్నారు.మొత్తానికైతే నాడు జగన్కు హ్యాండ్ ఇచ్చి మంత్రులు అయిన నలుగురిలో ఈ ఇద్దరు మాజీ మంత్రులు బాబుకు బాగానే సపోర్ట్గా నిలబడుతున్నారు.
>