భారతదేశంలో ఉంటూ దేశ వ్యతిరేక పనులకు పాల్పడితే పోలీసులు ఏమాత్రం క్షమించరు.దేశంలో ఉంటూ దాయాది దేశం పాకిస్థాన్ కు చెందిన జాతీయ పతాకాన్ని ఇంటి పై ఎగురవేసిన ఘటనలో ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది.మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాలోని షిప్రా గ్రామానికి చెందిన ఫారుక్ ఖాన్ అనే వ్యక్తి తన ఇంటిపై పాకిస్తాన్ జాతీయ పతాకాన్ని ఎగరేశాడు.
అయితే ఈ ఘటనకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడం తో ఈ విషయం కాస్త పోలీసుల దృష్టికి వెళ్ళింది.దీనితో రంగంలోకి దిగిన పోలీసులు ఆ జెండాను స్వాధీనం చేసుకొని ఫారుక్ ను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సామాజిక సామరస్యతకు విఘాతం కలిగిస్తున్నాడని ఆరోపిస్తూ ఖాన్పై ఐపీసీ సెక్షన్ 153ఏ కింద కేసు నమోదు చేశారు పోలీసులు.రెవెన్యూ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫారూక్ ను అదుపులోకి తీసుకున్నారు.
అయితే దీనిపై ఫారూక్ ఖాన్ స్పందిస్తూ.తన 12 ఏళ్ల కొడుకు తెలిసీతెలియకుండా ఇంటిపై పాకిస్తాన్ జెండా ఎగురవేశాడని పోలీసులకు తెలిపాడు.
ఈ విషయం తనకు తెలియగానే జెండాను తొలగించినట్టు చెప్పాడు.అయితే పాకిస్తాన్ జెండా ఎక్కడి నుంచి వచ్చిందని పోలీసులు అడిగితే మాత్రం ఫారూక్ ఎలాంటి సమాధానం ఇవ్వలేకపోవడం పోలీసులకు అనుమానం కలిగిస్తుంది.
అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.