ఏపీ లో ఫోన్ ట్యాపింగ్ పంచాయితీ రోజు రోజుకు పెద్దదైపోతుంది. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు చేస్తున్న ఆరోపణలు రాజకీయ రచ్చకు దారి తీస్తున్నాయి.
ప్రతిపక్ష నేతల ఫోన్ లను అధికార పక్షం ట్యాప్ చేస్తుంది అంటూ ఇటీవల ఏపీ ప్రతిపక్ష నేత,టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీ కి సైతం లేఖ రాసిన విషయం విదితమే.రాజ్యాంగంలోని 19,21 లను ఉల్లఘిస్తూ అధికార పక్షం ఫోన్ ట్యాపింగ్ లకు పాల్పడుతుంది అంటూ కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరింత దుమారం రేగుతుంది.
దీనిపై ఏపీ హైకోర్టు లో కూడా పిటీషన్ దాఖలు కావడం తో విచారణ చేపట్టిన కోర్టు తాజాగా 16 మందికి నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది.
సీబీఐ,రిలయన్స్,వోడాఫోన్,ఎయిర్ టెల్,బీ ఎస్ ఎన్ ఎల్ ప్రొవైడర్స్ కు కూడా నోటీసులు అందించిన కోర్టు 4 వారాల్లో ఫోన్ ట్యాపింగ్ పై పూర్తి వివరాలను వెల్లడించాలి అంటూ కోర్టు స్పష్టం చేసింది.అంతేకాకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దీనిపై పూర్తి వివరాలను సేకరించి అఫిడవిట్ దాఖలు చేయాలి అంటూ కోర్టు స్పష్టం చేసింది.
న్యాయమూర్తుల ఫోన్లపై నిఘా పెట్టారంటూ కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లలో వార్తలు ప్రసారమైన నేపథ్యంలో ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు జరిపించాలని హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది.
విశాఖ జిల్లా గోపాలపట్నానికి చెందిన న్యాయవాది నక్కా నిమ్మీగ్రేస్ సోమవారం పిల్ దాఖలు చేశారు.ప్రభుత్వంలోని రాజకీయ పెద్దల ప్రోద్బలంతో న్యాయ వ్యవస్థ ప్రతిష్టకు కళంకం తెచ్చేలా వ్యవహరించారని పిటిషనర్ ఆరోపించడం తో విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు ఈ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి 16మందికి నోటీసులు జారీ చేసింది.దీనిపై విచారణ జరిపి నాలుగు వారాల్లో వివరాలను వెల్లడించాలి అంటూ కోర్టు స్పష్టం చేసింది.