కరోనాతో మహమ్మారి ప్రపంచాన్ని కారుమబ్బులా కమ్మేసింది.ఎక్కడికక్కడ కేసుల సంఖ్య పెరుగుతూ, ప్రపంచ దేశాలను భయాందోళనలోకి నెట్టేసింది.
ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఈ మహమ్మారిని అదుపుచేసే వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవడంతో ఏం చేయాలో తెలియని పాలుపోని స్థితిలో అన్ని దేశాలు ఉన్నాయి.మన దేశంలో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది.
ప్రస్తుతం అన్ని దేశాలు, అన్ని రాష్ట్రాలు రాజకీయాలను పక్కన పెట్టి పూర్తిస్థాయిలో ఏపీలో కరోనా కట్టడిపైనే దృష్టిపెట్టగా, ఏపీ లో మాత్రం కరోనా రాజకీయాలతో నాయకులు బిజీగా ఉన్నారు.ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటూ అసలు సంగతి పక్కన పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.
అసలు అధికార పార్టీ తప్పిదాల వల్లే ఈ స్థాయి లో కరోనా ఏపీలో విజృంభిస్తోంది అని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.కరోనా కేసుల సంఖ్య ఏపీలో తక్కువగా నమోదవుతున్న సమయంలో కరోనా నిర్ధారణ పరీక్ష తక్కువగా నిర్వహించారని, విమర్శలు చేశారు.
ఆ తర్వాత ప్రభుత్వం కరోనా నిర్ధారణ పరీక్షలు సంఖ్య భారీగా పెంచడంతో కొత్తగా కేసులు బయట పడుతూ వస్తున్నాయి.ఇప్పుడు కేసుల సంఖ్య ఎక్కువగా నమోదవుతున్నాయని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
కేసులు తక్కువగా నమోదవుతున్నా, మరణాల శాతం తక్కువగా ఉందని ప్రభుత్వం ప్రకటిస్తుంది.ఈ విధంగా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు.
ప్రస్తుతం అమరావతి వ్యవహారం సర్దుమణిగినట్టు కనిపించడంతో, తెలుగుదేశం పార్టీ పూర్తిగా కరోనా రాజకీయాల పైనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.ఈ విషయంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్ట్ అయిన మాజీ మంత్రి, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్నాయుడు అనారోగ్య కారణాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.ఈ నేపథ్యంలో ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో, ఇప్పుడు ఈ వ్యవహారాన్ని అధికార పార్టీ మెడ కు చుట్టేందుకు టిడిపి ప్రయత్నిస్తోంది.
అచ్చెన్నను అనవసరంగా, పంతం కోసం అరెస్ట్ చేయడంతో ఇప్పుడు ఆయన కరోనా బారినపడ్డారు అంటూ విమర్శలు చేస్తున్నారు.అలాగే కరోనా నియంత్రణకు, చికిత్స నిమిత్తం ఏపీ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు పెట్టడం పైన టిడిపి విమర్శలు చేస్తోంది.
ఈ వ్యవహారంలో అనేక అవకతవకలు జరుగుతున్నాయి అంటూ ఆ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండగా, అధికార పార్టీ నాయకులు ఆ విమర్శలను తిప్పి కొడుతూ, సమయమంతా విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునేందుకు సమయం అంతా కేటాయిస్తున్నారు తప్ప ఈ వ్యవహారంపై రాజకీయాలకతీతంగా స్పందిస్తూ, కరోనా నియంత్రణకు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి.