‘‘ పరోపకార్ధాయ మిదం శరీరం ’’ అన్న సూక్తి భారతీయుల రక్తంలో ఇంకిపోయింది.ప్రపంచంలో ఏ మూల ఉన్నా సరే.
తోటి వ్యక్తి ఆపదలో ఉంటే ప్రాణాలను సైతం లెక్క చేయకుండా వారిని కాపాడే తత్త్వం భారతీయుల సొంతం.తాజాగా నీటిలో మునిగిపోతున్న ముగ్గురు చిన్నారులను రక్షించి తన ప్రాణాలను పొగొట్టుకున్నాడో భారతీయుడు.
కాలిఫోర్నియాకు చెందిన ఇద్దరు బాలికలు, ఓ బాలుడు కింగ్స్ నది ఒడ్డున ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయారు.ప్రవాహ వేగానికి వారు నదిలో కొట్టుకోతున్నారు.
దీనిని గమనించిన భారత సంతతికి చెందిన 29 ఏళ్ల సిక్కు యువకుడు మంజీత్ సింగ్ ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నదిలో దూకాడు.వారిని క్షేమంగా ఒడ్డుకు చేర్చి, పిల్లల ప్రాణాలు కాపాడాడు.
అయితే నదిలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో మంజీత్ నీటిలో మునిగిపోయాడు.
స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన సహాయక బృందాలు, నదిలో సుమారు 40 నిమిషాల పాటు గాలించి అతని మృతదేహాన్ని వెలికి తీశారు.
మరోవైపు ఈ ఘటన నుంచి బయటపడిన ముగ్గురు చిన్నారుల్లో ఇద్దరు సురక్షితంగా ఉన్నారని, మరో ఎనిమిదేళ్ల చిన్నారి పరిస్ధితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.మంజీత్కు ఈ చిన్నారులకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం పిల్లలను కాపాడేందుకే నదిలో దూకాడాని పోలీసులు తెలిపారు.