వందే భారత్ మిషన్ ఐదవ దశ ఆగష్టు 1వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే.23 దేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి రప్పించేందుకు మొత్తం 792 విమానాలను షెడ్యూల్ చేశారు.వీటిలో 692 అంతర్జాతీయ విమానాలు కాగా, 100 దేశీయ విమానాలు వున్నాయి.జీసీసీ దేశాలతో పాటు యూఎస్, కెనడా, యూకే, జర్మనీ, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, మలేషియా, ఫిలిప్పీన్స్, సింగపూర్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, చైనా, ఇజ్రాయెల్, కిర్గిస్తాన్ దేశాల్లో ఉన్న భారతీయులను మనదేశానికి తీసుకురానున్నారు.
అయితే జర్మనీలో చిక్కుకుపోయిన ఓ భారతీయుడు తాను కేరళకు వెళ్లేందుకు టికెట్ ఇప్పించాల్సిందిగా మోడీ ప్రభుత్వం, ఎయిరిండియాపై కేసు పెట్టాడు.
అతను ఎదుర్కొన్న ఆవేదనను మీడియాతో పంచుకున్నాడు.
కేరళకు చెందిన మజీద్ అనే వ్యక్తి 2015 నుంచి యూరప్లో, 2018 నుంచి మ్యూనిచ్లో పనిచేస్తున్నాడు.అయితే ఈ ఏడాది ప్రారంభంలో బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో అతనికి ఉద్యోగం వచ్చింది.
దీంతో మజీద్ స్వదేశానికి వెళ్లేందుకు జూన్ 5న ఏర్పాట్లు చేసుకున్నాడు.ఇదే సమయంలో కరోనా వైరస్ సంక్షోభం కారణంగా జర్మనీ, భారత ప్రభుత్వాలు లాక్డౌన్లను ప్రకటించాయి.
అయితే వందే భారత్ మిషన్లో భాగంగా ఫ్రాంక్ఫర్ట్ నుంచి ఢిల్లీకి మూడు విమానాలను నడుపుతున్నట్లు మోడీ ప్రభుత్వం ప్రకటించింది.వీటి గురించి మజీద్కు సమాచారం లేదు.
తన ఇబ్బందుల గురించి తెలియజేయడానికి స్వయంగా ట్విట్టర్ ఖాతాను తెరిచి బెర్లిన్ ఎంబసీ, కేరళ ముఖ్యమంత్రి, ఎయిరిండియాలకు ట్వీట్ చేశానని అతను వాపోయాడు.
ఈ క్రమంలో ఫ్రాంక్ఫర్ట్ నుంచి బెంగళూరు మీదుగా ఢిల్లీకి ఎయిరిండియా జూలై 1న ఒక విమానాన్ని నడుపుతున్నట్లు ప్రకటించింది.అయితే ఇప్పుడు కూడా ఇదే రకమైన అనుభవం ఎదురవ్వడంతో మజీద్ జీర్ణించుకోలేకపోయాడు.క్షణం కూడా ఆలస్యం చేయకుండా భారత ప్రభుత్వం, ఎయిరిండియా, కేరళ రాష్ట్ర ప్రభుత్వం, జర్మనీలోని భారత రాయబారిపై కేరళ హైకోర్టులో జూలై 3న కేసు పెట్టాడు.
దీనిపై జూలై 6న విచారణ జరిగింది.
ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన ప్రతినిధి, తమకు ఈ కేసు గురించి తెలియదని చెప్పారు.ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను జూలై 9కి వాయిదా వేసింది.జూలై 8 సాయంత్రం, తన పేరు, పాస్పోర్ట్ నెంబర్, ఈ- టికెట్ నెంబర్) ఇవ్వాల్సిందిగా తన న్యాయవాది అడిగారని మజీద్ చెప్పాడు.
అయితే ఆ తర్వాతి రోజు విచారణకు హాజరవుతుండగా జూలై 12న ఫ్రాంక్ఫర్ట్ నుంచి బెంగళూరు వెళ్లే ఎయిరిండియా విమానంలో టికెట్ కన్ఫర్మ్ అయినట్లు ఈమెయిల్ వచ్చిందని ఆయన తెలిపారు.ఈ రకంగా ఎంతో పోరాటం చేస్తే కానీ మజీద్ స్వదేశానికి చేరుకోలేకపోయాడు.