కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి తెలిసిందే.సడలింపులతో గత నెల నుంచి అన్ లాక్ ప్రక్రియ ప్రారంభమైంది.
కానీ, కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ కొనసాగుతూనే ఉంది.తాజాగా రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ పై కీలక నిర్ణయాలు తీసుకుంది.
ఆగస్టు 31వ తేదీ వరకు లాక్ డౌన్ పొడగిస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.అయితే ఇందులో లాక్ డౌన్ లో మరి కొన్ని సడలింపులు ఇస్తున్నట్లు ప్రకటించింది.
ఇప్పటి వరకూ కొనసాగిన రాత్రి పూట కర్ఫ్యూను ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.ఈ మేరకు ప్రభుత్వం ప్రకటించిన సడలింపుల గురించి తెలుసుకుందాం.
తెలంగాణ ప్రభుత్వం రాత్రి ఉత్తర్వుల్లో పేర్కొన్నవి ఈ క్రింది విధంగా ఉన్నాయి.ఇప్పటి నుంచి అంతరాష్ట్ర ప్రయాణాలు, ఇతర రాష్ట్రాల ప్రయాణాలకు సంబంధించిన ఆంక్షలను ఎత్తివేసింది.సినిమా హాళ్లు, స్విమ్మింగ్ పూల్స్, బార్స్, మెట్రో రైలు సేవలపై ఆంక్షలు అలానే కొనసాగుతాయి.విద్యార్థులకు సంబంధించి స్కూళ్లు, కాలేజీలు, కోచింగ్ సెంటర్లు ఈ నెల చివరి వరకు తెరచుకోవని స్పష్టం చేసింది.
కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా శుభకార్యాలు జరుపుకోవచ్చు.వివాహాలు, శుభకార్యాలకు 50 మంది ఆహ్వానితులు, అంత్యక్రియల్లో 20 మంది వరకు పాల్గొనవచ్చని వెల్లడించింది.రాజకీయ, క్రీడా, సామాజిక, సభలు, సమావేశాలకు అనుమతి లేదని, కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం పేర్కొంది.కాగా, ఆగస్టు 5వ తేదీ నుంచి జిమ్, యోగా సెంటర్లు తెరుచుకునే విషయం అందరికి తెలిసిందే.