దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతూ కరోనా భయాన్ని రెట్టింపు చేస్తోంది.పాజిటివ్ అనే పేరు వింటే భయపడాల్సిన పరిస్థితి కరోనా వల్ల నెలకొంది.
అయితే కరోనా రోగుల ప్రాణాలను రక్షించడం కోసం వైద్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లు ఎంతో కష్టపడి సేవలందిస్తున్నారు.వీళ్లలో కొందరు వైరస్ భారీన పడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి.
అయితే పలు ప్రాంతాల్లో మాత్రం రోగులకు సేవలందిస్తున్న వైద్యులు, ఫ్రంట్ లైన్ వర్కర్లపై దాడులు జరుగుతున్నాయి.
తాజాగా అలాంటి ఘటన ఒకటి కర్ణాటక రాజధాని బెంగళూరులో చోటు చేసుకుంది.75 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకగా ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు అంబులెన్స్ కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు.ఆంబులెన్స్ డ్రైవర్ సదరు రోగిని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లగా బెడ్ల కొరత వల్ల చేర్చుకోవడం కుదరదని ఆస్పత్రి సిబ్బంది చెప్పారు.
అదే సమయంలో కరోనా రోగి ఆంబులెన్స్ లోనే మృతి చెందాడు.
కరోనా రోగి మృతితో ఆ వ్యక్తి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.
ఆంబులెన్స్ లో ఆక్సిజన్ కిట్ లేకపోవడం వల్లే వృద్ధుడు మరణించాడని… అంబులెన్స్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే రోగి ప్రాణాలు పోయాయని ఆరోపణలు చేశారు.అనంతరం డ్రైవర్ పై దాడి చేశారు.
కరోనా కష్టకాలంలో రోగుల ప్రాణాలను కాపాడటం కోసం శ్రమిస్తున్న సిబ్బందిపై దాడులు చేయడం గురించి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఆంబులెన్స్ డ్రైవర్ తనపై కరోనా రోగి కుటుంబ సభ్యులు దాడి చేయడం గురించి సదాశివనగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.