భారతదేశాన్ని కరోనా మహమ్మారి చిగురుటాకులా వణికిస్తోంది.ప్రతిరోజూ ఎవరూ ఊహించని స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
గత 24 గంటల్లో దేశంలో 55,000కు పైగా కేసులు నమోదు కాగా మరికొన్ని రోజుల్లో రోజుకు లక్ష కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతూ ఉండటం గమనార్హం.ప్రజల నిర్లక్ష్యం వల్లే వైరస్ ఈ స్థాయిలో వ్యాప్తి చెందుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మాస్క్ ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ, తరచూ సబ్బు నీళ్లతో లేదా శానిటైజర్ తో చేతులను శుభ్రం చేసుకోవడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోగలుగుతాం.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే మాస్క్ ధరించని వారి విషయంలో కఠినంగా వ్యవహరిస్తూ జరిమానాలు విధిస్తున్నాయి.
తాజాగా గూగుల్ మ్యాప్స్ ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్న వారికి “మాస్క్ ధరించు.ప్రాణాలు కాపాడు” అని చెబుతూ కొన్ని సలహాలు, సూచనలు చేస్తోంది.
ఆండ్రాయిడ్ ఫోన్లు వాడే వాళ్లకు మ్యాప్స్ ఎక్స్ఫోర్ల్లో ఫేస్ మాస్క్ వేసుకున్న యానిమేషన్తో ఒక మహిళ బొమ్మ కనిపిస్తుంది.లర్న్ మోర్ బటన్ నొక్కి కరోనా సూచనలను, సలహాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా సులభంగా తెలుసుకోవచ్చు.
ప్రస్తుతం యూఎస్ లోని ఆండ్రాయిడ్ యూజర్లకు మాస్క్ రిమైడర్ బ్యానర్ కనిపిస్తుండగా మరికొన్ని రోజుల్లో ఇతర దేశాల్లో కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.