అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో డెమొక్రటిక్ పార్టీ నేత జో బిడెన్ దూసుకెళ్తున్నారు.అన్ని వర్గాల ఓటర్లను ఆకర్షించేలా తన క్యాంపెయినింగ్ను ప్లాన్ చేసుకుంటున్నారు.
స్థానిక అమెరికన్లతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చి యూఎస్లో స్థిరపడిన వారి ఓట్లను తన సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు.ఈ క్రమంలో అమెరికాలో అభ్యర్ధుల గెలుపొటములను ప్రభావితం చేసే భారతీయులు, భారత సంతతి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అక్కడి పార్టీలు ఎత్తులు వేస్తుంటాయి.
తాజాగా బిడెన్ సైతం ఇండో అమెరికన్ ఓటర్లను చేరుకునేందుకు గాను 14 భాషల్లో ప్రచార కార్యక్రమాన్ని ప్లాన్ చేశారు.ఇందులో భాగంగా మనదేశంలోని భాషల్లో నినాదాలతో ముందుకొచ్చారు.
‘‘ అమెరికా కా నేత.కైసా హో, జో బిడెన్ జైసా హో’’ ( అమెరికా అధినేత బిడెన్లా ఉండాలి) అంటూ హిందీ, తెలుగు సహా వివిధ భారతీయ భాషల్లో నినాదాలతో హోరెత్తించనున్నారు.2016లో ‘‘ అబ్కీ ట్రంప్ సర్కార్’’ (ఈ సారి ట్రంప్ ప్రభుత్వం) నినాదం భారతీయుల్లోకి బలంగా వెళ్లింది.ఇప్పుడు అదే వ్యూహాన్ని డెమొక్రాట్లు అమలు చేస్తున్నారు.
దీనిపై బిడెన్ ప్రచార బృందంలో ఒకరైన అజయ్ భుటోరియా మాట్లాడుతూ.ఇండో అమెరికన్ ఓటర్లను వారి మాతృభాషలోనే చేరువయ్యేందుకు ప్రణాళికలు రూపొందించామని చెప్పారు.తెలుగు, హిందీ, పంజాబీ, తమిళ్, బెంగాలీ, ఉర్దూ, కన్నడ, మళయాళీ, ఒరియా, మరాఠీ, నేపాలీ సహా 14 భాషల్లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తామన్నారు.భారత్లో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జరిగే ప్రచారం చూసిన అనుభవంతో జో బిడెన్లోనూ ఆ సందడి ఉండేలా ప్రయత్నిస్తున్నామని అజయ్ చెప్పారు.
ఇండో అమెరికన్ ఓటర్లలో ఆ ఉత్సాహం కనిపించేలా చూసుకుంటామని ఆయన అన్నారు.కాగా నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్తో జో బిడెన్ తలపడనున్నారు.
ఆగస్టులో జరిగే డెమొక్రటిక్ నేషనల్ కన్వెన్షన్ సందర్భంగా బిడెన్ను ఆ పార్టీ అధికారికంగా తమ అభ్యర్ధిగా ప్రకటించనుంది.