తమిళనాడు రాష్ట్రంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది.రోజురోజుకు రికార్డు స్ధాయిలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.
తాజాగా తమిళనాడు రాజ్భవన్లో కరోనా కేసులు కలకలం రేపుతున్నాయి.రాజ్భవన్ లో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది.
దీంతో గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లారు.వైద్యుల సూచన మేరకు గవర్నర్ భన్వరిలాల్ ఏడు రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉండనున్నారని రాజ్ భవన్ అధికారులు వెల్లడించారు.
గవర్నర్ ఆరోగ్యంగానే ఉన్నారని., ముందు జాగ్రత్తలో భాగంగానే ఆయన సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
ఇటీవల రాజ్ భవన్లో విధులు నిర్వహించే 84 మంది భద్రతా.ఫైర్ సిబ్బంది కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.
అయితే వారిలో ఓ ఒక్కరూ గవర్నర్తో గానీ, సీనియర్ అధికారులతో గానీ కాంటాక్ట్ కాలేదని రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.తాజాగా రాజ్ భవన్లో మరో 38 మందికి పరీక్షలు చేయగా.
ముగ్గురికి పాజిటివ్ నిర్ధారణ అయింది.దేశంలోనే అత్యధిక కేసులు నమోదైన రెండో రాష్ట్రం తమిళనాడు.
మంగళవారం ఒక్కరోజే 6,972 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,27,688 మంది కరోనా బారిన పడ్డారు.వారిలో 1,66,956 మంది కరోనా నుండి కోలుకొని డిశ్చార్జ్ అవ్వగా.3,659 మంది మృతి చెందారు.