శత్రువుల వెన్నులో వణుకు పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాలు భారత్ లోకి అడుగు పెట్టాయి.ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన రాఫెల్ యుద్ధ విమానాలు అంబాలా ఎయిర్ బేస్ లో సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి.
ఫ్రాన్స్ తయారు చేసిన ఈ రాఫెల్ జెట్లు తొలి విడతలో భాగంగా భారత్ కు చేరుకున్నాయి.సోమవారం ఫ్రాన్స్ లోని మెరిగ్నాక్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన రాఫెల్ జెట్లు ఏడు గంటల తర్వాత యూఏఈలోని అల్ ధఫ్రా వైమానిక స్థావరంలో ఆగాయి. దాదాపు ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించిన రాఫెల్ యుద్ధ విమానాలకు భారత గగనతలంలో రెండు సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలు ఘన స్వాగతం పలికాయి.రాఫెల్ ల్యాండ్ అయిన క్షణం భారత సైనిక చరిత్రలో నూతన శకం మొదలైనట్లు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
బహుళ సామర్థ్యాలు కలిగిన రాఫెల్ యుద్ధ విమానాలు దేశ వాయుసేనను బలోపేతం చేస్తాయన్నారు.అంబాలా ఎయిర్ బేస్ లో ల్యాండ్ అయిన రాఫెల్ యుద్ధ విమానాల ఫోటోలను రక్షణ మంత్రి కార్యాలయం ట్విట్టర్ లో పోస్టు చేసింది.
చైనా దూకుడు చర్యలు ఎక్కువ అవుతున్న నేపథ్యంలో రాఫెల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించ బోతున్నాయని డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు.