డాక్టర్ సి నారాయణ రెడ్డి 89వ జయంతిని పురస్కరించుకుని సినారె ఆడిటోరియం నిర్మాణానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.హైదరాబాద్ బంజారాహిల్స్ లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సారస్వత సదనం ఆడిటోరియాన్ని నిర్మించనున్నారు.
ఈ శంకుస్ధాపన కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.
ప్రతిభ, పాండిత్యం అన్ని కలగలిపిన వ్యక్తి సినారె అని కీర్తించారు.దక్షిణ భారతదేశం నుంచి రాజ్యసభకు ఎన్నికైన మొదటి రచయిత, కవి సినారె అని కేటీఆర్ గుర్తు చేశారు.
సినారె జన్మించిన నియోజకవర్గం నుంచి శాసనసభకు ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు.తెలంగాణ కవులు, కళాకారులకు ఇదో కొత్త వేదిక అని., మూడు వేల చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ ఆడిటోరియాన్ని త్వరతిగతిన పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.సిరిసిల్ల జిల్లాలో గ్రంథాలయానికి సినారె పేరు పెట్టుకున్నామని కేటీఆర్ తెలిపారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.కళలు, కళాకారులను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని చెప్పుకొచ్చారు.ఇండోర్ ఆడిటోరియం నిర్మాణానికి ప్రభుత్వం రూ.10 కోట్లు విడుదల చేసిందన్నారు.పాఠ్య పుస్తకాల్లో సినారె చరిత్ర ఉండేలా చొరవ తీసుకుంటామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.