రాజస్థాన్ రాజకీయాల్లో ఇటీవల చోటుచేసుకున్న సంక్షోభం ఇంకా ఒకకొలిక్కి రావడం లేదు.ఫ్లోర్ టెస్ట్ కోసం అసెంబ్లీ ని సమావేశపరచాలి అంటూ ముచ్చటగా మూడోసారి కేబినెట్ తీర్మానంను గవర్నర్ కల్ రాజ్ మిశ్రా కు పంపగా దానిని కూడా తిరస్కరించారు.
అసెంబ్లీ లో తన బలాన్ని నిరూపించుకోవడానికి అసెంబ్లీ ని ఈ నెల 31 న సమావేశపరచాలి అంటూ సీఎం అశోక్ గెహ్లాట్ అధ్యక్షతన మంగళవారం కేబినెట్ సమావేశం నిర్వహించి తీర్మానం చేయగా దానిని కూడా గవర్నర్ ముచ్చటగా మూడోసారి వెనక్కి పంపించారు.
ఇప్పటికే రెండు సార్లు తీర్మానాన్ని తిరస్కరించిన ఆయన ఇప్పుడు తాజాగా మూడోసారి కూడా తిరస్కరించడం చర్చనీయాంశమైంది.
రెండు రోజుల క్రితం సభను సమావేశపరచడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ వ్యాఖ్యలు చేసిన ఆయన మళ్లీ తిరస్కరించడం గమనార్హం.అయితే అసెంబ్లీ ని సమావేశపరచాలి అంటే 21 రోజుల నోటీసు ఇవ్వవలసి ఉంటుంది అంటూ ఆయన పాట వ్యాఖ్యలనే గుర్తు చేస్తూ మరోసారి తీర్మానాన్ని తిరస్కరించినట్లు సమాచారం.
రాజస్థాన్ రాజకీయాల్లో సీఎం గెహ్లాట్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ లకు మధ్య ఏర్పడిన విభేదాల కారణంగా సంక్షోభం ఏర్పడిన విషయం తెలిసిందే.సచిన్ కు మద్దతుగా మరో 18 మంది ఎమ్మెల్యేలు కూడా నిలవడం తో వారందరికీ కూడా అనర్హత నోటీసులు జారీ అయ్యాయి.
దీనిపై సచిన్ వర్గం కోర్టును ఆశ్రయించగా కోర్టు కూడా పార్టీ విధానాలపై వ్యతిరేకత వ్యక్తం చేయడం అనేది నేరం కాదని వ్యాఖ్యానిస్తూ వారి అనర్హత నోటీసులను వెనక్కి తీసుకోవాలి అంటూ స్పీకర్ జోషి కి సూచించింది.దీనితో అసెంబ్లీ లో గెహ్లాట్ తన బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దీనికి గవర్నర్ విముఖత చూపుతుండడం తో గెహ్లాట్ వర్గానికి పెద్ద తలనొప్పి గా మారింది.