ఈ ఎస్ ఐ మందుల కొనుగోళ్ల విషయంలో అవకతవకలు జరిగాయని టీడీపీ నేత,మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ను గతనెల12 వ తేదీన పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.అయితే బెయిల్ కోరుతూ హైకోర్టు లో పిటీషన్ దాఖలు చేయగా విచారణ జరిపిన హైకోర్టు సోమవారం తీర్పును రిజర్వ్ లో పెట్టింది.
అయితే తాజాగా తీర్పు వెల్లడించిన కోర్టు ఆ పిటీషన్ ను కొట్టివేస్తున్నట్లు తెలిపింది.అచ్చెన్నాయుడితో పాటు ఈ కేసుకు సంబంధించి మిగిలిన వారి బెయిల్ పిటీషన్ లను కూడా కోర్టు కొట్టివేసింది.
టీడీపీ హయాంలో అచ్చెన్నాయుడు కార్మిక మంత్రిగా ఉన్న సమయంలో రూ.988 కోట్ల కొనుగోళ్లు జరిగాయని, అందులో రూ.150 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఎసీబీ దర్యాప్తు చేపట్టింది.గత ప్రభుత్వ హయాంలో అచ్చెన్నాయుడు సిఫార్సు మేరకు నామినేషన్ పద్ధతిలో కొనుగోళ్లు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
ఈ క్రమంలోనే గతనెల 12 వ తేదీన అచ్చెన్నాయుడిని అరెస్ట్ కూడా చేశారు.అయితే బెయిల్ కోసం సీబీఐ కోర్టును అప్పుడే సంప్రదించగా కోర్టు నిరాకరించడం తో చివరికి హైకోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చింది.
అయితే అక్కడ కూడా అచ్చెన్న కు చుక్కెదురైంది.ఈ కేసుకు సంబందించి అచ్చెన్నాయుడితో పాటు పితాని రమేశ్ కుమార్, పితాని పీఏ మురళి, సుబ్బారావు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు తోసిపుచ్చింది.
ఈ కేసుకు సంబంధించి ఇరు వర్గాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు ఏసీబీ వాదనతో ఏకీభవించింది.ఈ కేసుకు సంబంధించిన ఇంకా అనేక మందిని అదుపులోకి తీసుకుని విచారించాల్సిన నేపథ్యంలో నిందితులకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారయ్యే ఉందని ఏసీబీ వెల్లడించడం తో కోర్టు కూడా ఆ వాదనను పరిగణలోకి తీసుకొని ఈ మేరకు బెయిల్ పిటీషన్ ను కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.