విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించి అక్కడే మంచి ఉద్యోగంలో స్థిరపడాలన్నది లక్షలాదిమంది భారతీయ యువత కల.ఇందుకు తగ్గట్టుగానే చిన్నప్పటి నుంచి ఒక పక్క ప్రణాళికతో నిరంతరం శ్రమిస్తారు .
అంత కష్టపడి వెంట్రుక వాసిలో ఆ కల చెదిరిపోతే దీనిని భరించడం కష్టం.అచ్చం ఇలాంటి పరిస్థితే ఎదురైన ఓ యువ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది.
వివరాల్లోకి వెళితే.పంజాబ్ రాష్ట్రం కపుర్తాలాకు చెందిన 19 ఏళ్ల హర్లీన్ కౌర్ 12వ తరగతి బోర్డు పరీక్షల తర్వాత ఈ ఏడాది కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించాలని భావించింది.
అయితే ఇతర దేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం ఇబ్బంది లేకుండా సాగాలంటే అక్కడి భాష తెలియాలి లేదా ఆంగ్లంపై మంచి పట్టుండాలి.అది నిరూపించుకోవడానికి కొన్ని పరీక్షల్లో స్కోరు సాధించాలి.
దీనిలో భాగంగా అభ్యర్ధి పఠన, భాషణ, శ్రవణ, లేఖన సామర్ధ్యాలను ఐఈఎల్టీఎస్ విధానంలో పరిశీలిస్తారు.అయితే హర్లీన్ ఈ పరీక్షలో గతేడాది అనుకున్న స్థాయిలో సత్తా చాటలేదు.
దీంతో ఈ ఏడాది మరింత కష్టపడినప్పటికీ రెండోసారి కూడా ఫెయిల్ అయ్యింది.
ఫలితం తేడా కొట్టడంతో మనస్తాపానికి గురైన హర్లీన్ కౌర్ గత పది రోజులుగా తనలో తానే కుమిలిపోయింది.చివరికి తల్లిదండ్రులతో కూడా మాట్లాడటం మానేసింది.ఈ క్రమంలో ఈ శనివారం సాయంత్రం హర్లీన్ తల్లి కాశ్మీర్ కౌర్ ఆమె గది తలుపు కొట్టినా అటు నుంచి స్పందన లేదు.
దీంతో కంగారు పడిన ఆమె కిటీకి లోంచి చూడగా.హర్లీన్ ఉరికి వేలాడుతూ కనిపించింది.వెంటనే స్థానికుల సాయంతో తలుపులు బద్ధలు కొట్టి ఆమెను ఆసుపత్రికి తరలించింది.అయితే అప్పటికే హర్లీన్ మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.
మృతురాలి తండ్రి ఇటలీలో స్థిరపడగా.ఆమె తన తల్లి, చెల్లెలితో భారత్లోనే నివసిస్తోంది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం అనంతరం హర్లీన్ మృతదేహన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.