కరోనా మహమ్మారి ధాటికి అమెరికా అల్లాడిపోతోంది.రోజు రోజుకి కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య వేలల్లో నమోదు కావడంతో అమెరికన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరోనా సోకకుండా ఉండేందుకు ప్రభుత్వం ఎన్నో రకాల చర్యలు చేపడుతున్నా సామాజిక దూరం పాటించని కారణంగా, మరే ఇతర కారణాల ద్వారానో అమెరికా ప్రజలని ఇప్పటికీ కరోనా పట్టి పీడిస్తూనే ఉంది.ఎంతో మంది ప్రముఖులకి అలాగే సెలబ్రిటీలకి సోకినా కరోనా మహమ్మారి మరెంతో మందిని బలి తీసుకుంది.
రాజకీయ నాయకులు, కీలక అధికారులు, వైట్ హౌస్ సిబ్బంది ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మందిపై కరోనా దాడి చేస్తూనే ఉంది.తాజాగా ట్రంప్ బద్రత సలహాదారైన రాబర్ట్ ఓ బ్రెయిన్ కి కరోనా పాజిటివ్ గా తేలింది.
ఇప్పటి వరకూ ఎంతో మంది అధికారులకి కరోనా సోకగా ఆ స్థాయిలో ఉన్న కీలక అధికారికి కరోనా పాజిటివ్ రావడం మాత్రం ఇదే ప్రధమమని తెలుస్తోంది.ఇదే విషయాన్ని వైట్ హౌస్ కూడా ధృవీకరించింది.
ఓబ్రెయిన్ కు కరోనా లక్షణాలు ఉన్నాయని ప్రస్తుతం ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉన్నారని తెలిపింది.ఇదిలాఉంటే
తాజాగా పరిణామాల కారణంగా ట్రంప్ కి అత్యంత దగ్గరలా మెలిగే ఓబ్రెయిన్ కారణంగా ట్రంప్ కి కరోనా వచ్చిందేమోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఈ మేరకు స్పందించిన వైట్ హౌస్, అధ్యక్షుడు ఉపాధ్యక్షుడికి వచ్చిన ముప్పు ఏమీ లేదని వారు సురక్షితంగా ఉన్నారని ప్రకటించింది.ఇక బ్రెయిన్ ఓ విందు కార్యక్రమానికి వెళ్ళారని అక్కడి నుంచీ కరోనా సోకి ఉండచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు.