స్త్రీ ఆకారంలో ముగ్గు బొమ్మ గీసీ, ఆ బొమ్మకు మధ్యలో ఓ యువతి ఫోటోను పెట్టి క్షుద్ర పూజ చేసిన ఘటన నెల్లూరు జిల్లా చోటు చేసుకుంది.మేకలు కాస్తున్న కాపరికి ఈ ఆనవాళ్లను చూసి స్థానిక జేవీవీ నాయకులుకు సమాచారం అందజేశాడు.
దీంతో ఈ క్షుద్ర పూజ తతంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని కావలి రోడ్డు వెంబడి ఓ అటవీ ప్రాంతం ఉంది.
అక్కడ కొందరు ఆగంతకులు క్షుద్ర పూజలు చేయడం స్థానికుల్లో తీవ్ర కలకలం రేపింది.అర్ధరాత్రి సమయంలో ఈ నిర్మానుష్యమైన అటవీ ప్రాంతంలో సున్నంతో స్త్రీ ఆకారంలో ముగ్గు వేశారు.
ఆ ఆకారానికి నడి మధ్యలో ఓ యువతి ఫోటోను ఉంచి క్షుద్ర పూజలు నిర్వహించారు.అక్కడ పసుపు, కుంకుమ, గుమ్మడికాయ, కొబ్బరికాయ, సాంబ్రాణి, కర్పూరం పడి ఉన్నాయి.
సోమవారం మేకలను తీసుకుని ఓ కాపరి ఆ అడవి ప్రాంతానికి వెళ్లాడు.అనుకోకుండా ఆ విచిత్ర చిత్రాన్ని ఒక్కసారిగా చూసేసరికి భయాందోళనకు గురయ్యాడు.
ఇక్కడ ఎవరో క్షుద్రపూజలు నిర్వహించారని పసిగట్టి స్థానిక జేవీవీ నాయకులను సంప్రదించాడు.అక్కడికి చేరుకున్న నాయకులు ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారులకు, పోలీసులకు తెలిపారు.
అక్కడికి చేరుకున్న అధికారులు ఈ కాలంలో మూఢనమ్మకాలు ఏంటనీ సంజాయిషీ చెప్పి వెళ్లిపోయారు.కాగా, జేవీవీ నాయకులు క్షుద్ర పూజ చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, అర్ధరాత్రి వరకు అడవుల్లో తిరిగే వారిని అటవీ శాఖ అధికారులు పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.
కాగా, ఫోటోలో ఉన్న యువతి ఎవరో తెలియాల్సి ఉంది.