భారత్లో ఉన్న ఓ ఉద్యోగి ఫిర్యాదు మేరకు చైనాకు చెందిన అలీబాబా వ్యవస్థాపకుడు జాక్ మాతో పాటు దిగ్గజ ఈ కామర్స్ సంస్థకు భారత్ కోర్టు సమన్లు జారీ చేసింది.కంపెనీ యాప్లు, డాక్యుమెంట్లలో సెన్సార్షిప్, ఫేక్ న్యూస్లపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు గాను, తనను తప్పుడు పద్దతుల్లో ఉద్యోగం నుంచి తొలగించారని భారత్లో కంపెనీ మాజీ ఉద్యోగి కోర్టును ఆశ్రయించారు.
ఇటీవల సరిహద్దు వివాదం కారణంగా భద్రత రీత్యా అలీబాబాకు చెందిన పలు యాప్లను భారత ప్రభుత్వం నిషేధించిన క్రమంలోనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.అలీబాబాకు చెందిన జాక్ మా కంపెనీకి చెందిన 12 మంది అధికారులు ఈ నెల 29న కోర్టు ఎదుట హాజరు కావాలని గురుగ్రాం జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది.
చైనాకు చెందిన యాప్స్లకు ప్రతికూలంగా ఉన్న కంటెంట్ను కంపెనీ సెన్సార్ చేసిందని, అవి రాజకీయ గందరగోళానికి తావిచ్చేవిగా ఉన్నట్టు చైనాకు చెందిన యాప్ యూసీ బ్రౌజర్ వెబ్ మాజీ ఉద్యోగి పుషేంద్ర సింగ్ కోర్టుకు సమర్పించిన పత్రాల్లో వెల్లడించారు.వీటిపై ప్రశ్నించినందుకు తనను అకారణంగా తొలగించారని పత్రాల్లో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై ఇచ్చిన సమన్లలో పేర్కొన్న విధంగా 30 రోజుల్లోగా తమ స్పందనను లిఖితపూర్వకంగా తెలియజేయాలని అలీబాబా కంపెనీతో పాటు సంస్థ ఎగ్జిక్యూటివ్లను న్యాయమూర్తి కోరారు.కాగా, దీనిపై స్పందించిన యూసీ బ్రౌజర్ ఇండియా, సంస్థ భారత్లోని స్థానిక చట్టాలకు అనుగుణంగా వ్యవహరిస్తోందని వెల్లడించింది.
ప్రస్తుత వివాదంపై తాము ఇప్పుడే వ్యాఖ్యానించే పరిస్థితిలో లేమని స్పష్టం చేసింది.
పుష్పేంద్ర సింగ్ పార్మర్ 2017 అక్టోబర్ వరకు గురుగ్రాంలోని యూసీ వెబ్ కార్యాలయంలో అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేశారు.అకారణంగా తనను ఉద్యోగం నుంచి తొలగించినందుకు పరిహారంగా 2,68,000 డాలర్లు చెల్లించాలని పార్మర్ కోరుతున్నారని రాయ్టర్స్ పేర్కొంది.చైనాతో పాటు ఆ దేశ యాప్లకు వ్యతిరేకంగా ఏదైనా కంటెంట్ ఉంటే యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్ దాన్ని తొలగించేదని పుష్పేంద్ర సింగ్ చెప్పారు.
ఇవి సామాజిక, రాజకీయ ఉద్రిక్తతలకు కారణమవుతాయన్న వంకతో వాటిని తొలగించేవారని పుష్పేంద్ర సింగ్ తెలిపారు.కాగా భారత సమగ్రతకు ఆయా చైనా యాప్లు ముప్పుగా పరిణమించాయని విశ్వసనీయ సమాచారం అందడంతోనే వాటిని నిషేధించామని భారత్ స్పష్టం చేసింది.