కరోనా వైరస్ ఏ మూల నుంచి వచ్చి దాడి చేస్తుందో ఎవరికీ తెలియదు.దీని నుంచి మనతో పాటు తోటి వారిని సైతం కాపాడేందుకు ఏకైక మార్గం మాస్క్ ధరించడం.
కోవిడ్ 19 వ్యాప్తి తర్వాత మనిషి జీవితంలో ఇది అత్యంత ముఖ్యమైన వస్తువుగా మారిపోయింది.మరోవైపు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు సైతం మాస్క్ ధరించడాన్ని తప్పనిసరి చేశాయి.
ఈ ఆదేశాలు ధిక్కరించిన వారికి భారీ జరిమానాలు విధిస్తున్నాయి.కేసుల భయం కారణంగా ఒకరితో చెప్పించుకోకుండా ప్రజలే తమంత తాముగా మాస్కులు ధరిస్తున్నారు.
అయితే మాస్క్ పెట్టుకోమని విజ్ఞప్తి చేసినందుకు ఓ మహిళ .స్టోర్లో అనాగరికంగా ప్రవర్తించింది.కాలిఫోర్నియా రాష్ట్రం రోజ్విల్లేలోని గలేరియా బౌలేవార్డ్ దుకాణానికి ఓ మహిళ సహా ముగ్గురు వచ్చారు.ఈ క్రమంలో అక్కడ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు వారిని మాస్క్లు ధరించకుంటే స్టోర్ నుంచి బయటకి గెంటేస్తామని హెచ్చరించారు.
అయితే దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ మహిళ దుకాణం లోపల మూత్ర విసర్జన చేసింది.ఈ ఘటన తర్వాత రోజ్ విల్లే పోలీసులు సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు.
దీనితో పాటు స్టోర్ నుంచి దొంగిలించబడిన వస్తువులను ఆమె వాహనంలో కనుగొన్నారు.కాగా అమెరికాలో ఈ తరహా ఘటనలు ఎక్కువగా వెలుగుచూస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితం ఓక్లహోమా సిటీలో ఓ మహిళ మాస్కు లేకుండా చెప్పుల షాపులోకి వెళ్లింది.ఆ సమయంలో అక్కడ విధుల్లో వున్న మహిళా సిబ్బంది ఆమెను మాస్క్ పెట్టుకోమని సూచించింది.
అయినప్పటికీ ఆమె ఇదేమి పట్టించుకోకుండా తన పని తాను చూసుకోంటోంది.సిబ్బంది మరోసారి చెప్పడంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు మహిళ దగ్గరున్న షూ బాక్సులను తీసుకుని సిబ్బందిపైకి విసిరి పారిపోయింది.