కడప జిల్లాలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.అతడిని ఐదుగురు యువకులు అతి కిరాతకంగా చంపారు.
కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు.తీవ్ర రక్త స్రావంతో ఆ యువకుడు మరణించాడు.
ఈ విషాదకర ఘటన వల్లూరు మండలంలోని లింగాయపల్లెలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే.
లింగాయపల్లెకి చెందిన మధుసూదన్ (21) కడప ఆర్ట్స్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు.మృతుడి తండ్రి చాలా ఏళ్ల క్రితమే ఇంటి నుంచి పారిపోయాడు.
కుటుంబ పోషణ భారం కావడంతో ఉపాధి కోసం తల్లి కువైట్ వెళ్లి ఉద్యోగం చేస్తుంది.దీంతో మధుసూదన్ అమ్మమ్మ, పిన్నితో కలిసి లింగాయపల్లెలో ఉంటున్నాడు.
అమ్మమ్మ వాళ్ల ఇంటి నుంచే కాలేజీకి చదువుకోవడానికి వెళ్తున్నాడు.ఆదివారం సెల్ఫోన్ ఛార్జర్ ఇవ్వడం లేదని కాలేజీ స్నేహితులైన రత్నం, కృష్ణ, ఫణీంద్ర, నాగార్జున, పవన్కుమార్లతో అతడు గొడవ పడ్డాడు.
మధుసూదన్ తమపై ఎదురు తిరగడం చూసి తట్టుకోలేక పోయారు.కోపంతో రగిలిపోయిన వాళ్లు మద్యం సేవించి ఎలాగైనా హతమార్చాలని పన్నాగం పన్నారు.తాగిన మత్తులో అరగంట సేపు తర్వాత మధుసూదన్ ఉంటున్న దగ్గరికి వెళ్లారు.కత్తులు తీసి మధుసూదన్పై విచక్షణా రహితంగా పొడవడం ప్రారంభించారు.
ఆ దాడిలో మృతుడి ఛాతీపై మూడుచోట్ల గాయాలయ్యాయి.పొడిచిన అనంతరం ఐదుగురు యువకులు అక్కడి నుంచి బైకులపై పరారయ్యారు.
ఈ ఘటనలో మధుసూదన్ కి తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.మధుసూదన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.