ప్రస్తుత కాలంలో కొందరు ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ క్షణికావేశం కోల్పోయి ఏకంగా హత్యలు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.తాజాగా కొందరు వ్యక్తులు సెల్ ఫోన్ చార్జర్ కోసం తమ స్నేహితుడు గొడవ పడ్డాడని ఫుల్లుగా మద్యం సేవించి మత్తులో యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేసినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కడప జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళితే స్థానిక జిల్లాకి చెందినటువంటి మధుసూదన్ అనే యువకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి వల్లూరు మండలంలోని ఓ గ్రామంలో నివాసం ఉంటున్నాడు.అయితే ఇటీవలే మధుసూదన్ తన సెల్ ఫోన్ చార్జర్ ని తన స్నేహితుడు తీశాడని అంటూ అతడితో గొడవకి దిగాడు.
అయితే ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి పెద్ద వాగ్వాదం జరిగింది.ఇది గమనిస్తున్న స్థానికులు వారిని పిలిపించి సర్ది చెప్పి పంపించారు.అయినప్పటికీ మధుసూదన్ స్నేహితులు మాత్రం అతడిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని పన్నాగం పన్నారు.
ఈ క్రమంలో పీకల దాకా మద్యం సేవించి ఇంటి వద్ద ఒంటరిగా ఉన్నటువంటి మధుసూదన్ పై విచక్షణ రహితంగా కత్తులతో దాడి చేశారు.
దాంతో మధుసూదన్ తీవ్ర రక్త స్రావానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు.విషయం తెలుసుకున్న నిందితులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.కాగా స్థానికల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి పంచనామా నిమిత్తం తరలించారు.అలాగే స్థానికులు మరియు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు ఫిర్యాదు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.