భారతదేశంలో రోజురోజుకి కరోనా వైరస్ ఏ విధంగా వ్యాప్తి చెందుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నేడు ఒక్కరోజే అత్యధికంగా దేశం మొత్తంగా కొత్తగా 20 వేల కేసులు నమోదయ్యాయి.
అంతేకాకుండా మన తెలుగు రాష్ట్రలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా కరోనా విజృంభిస్తున్న సంగతి అందరికీ విదితమే.అయితే ఈ పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతరాష్ట్ర బస్సు సర్వీసులు నడిపేందుకు కరోనా వైరస్ బ్రేక్ వేస్తోంది.
అసలు విషయంలోకి వెళ్తే.ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య సర్వీసులు ప్రారంభించడానికి అవసరమైన ఒప్పందం ఇప్పటికే ఒక దశకు చేరుకున్నప్పటికి, రోజురోజుకి తెలుగు రాష్ట్రాలలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య విపరీతంగా పెరిగిపోవడంతో చర్చలు ముగియకుండా నిలిచిపోయాయి.
దీనికి కారణం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర బస్ భవన్ లో ఆపరేషన్ వివరాలు చూసే విభాగంలోని ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడమే.
ఇక ఈ నేపథ్యంలో గత బుధవారం చర్చలు జరగాల్సి ఉండగా ఉద్యోగులకు కరోనా పాజిటివ్ అని తేలడంతో చర్చలు వాయిదా పడ్డాయి.
ఈ విషయంపై తెలంగాణ రాష్ట్రలకు సంబంధించిన ఆర్టీసీ ఉన్నత అధికారి త్వరలో ఇరు రాష్ట్రాల మధ్య చర్చలకు సంబంధించి ప్రణాళికలు రూపొందిస్తామని తెలియజేశారు.ఏదేమైనా ఇప్పట్లో తెలుగు రాష్ట్రాల మధ్య పూర్తిగా బస్సు లు తిరిగే సదుపాయం లేనట్టే మరి.