తెలుగు రాష్ట్రాల నుంచి ఉన్నత స్థానాలకి వెళ్ళిన ఎంతో మంది మనకి కనిపిస్తూ ఉంటారు.వాళ్ళ స్వశక్తితో అరుదైన గుర్తింపుని తెచ్చుకుంటూ ఉంటారు.
హైదరాబాద్ కి చెందిన సత్యా నాదెళ్ళ మైక్రోసాఫ్ట్ సిఈఓ అయినపుడు దేశం మొత్తం అతని పేరు మారుమోగిపోయింది.అలాగే వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అయినపుడు కూడా దేశం మొత్తం చర్చించుకున్నారు.
అలాగే కొంత మంది ప్రభుత్వ అధికారులు కూడా ఇలాగే తమ సామర్ధ్యంతో గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు.అలా ఇప్పుడు ఏపీలో వెనుకబడిన జిల్లా అయిన శ్రీకాకుళంలో ఒక మారుమూల గ్రామం నుంచి ఐఏఎస్ ఆఫీసర్ గా ఎదిగి ఇప్పుడు అమెరికాలో భారత ప్రత్యేక ఆర్ధిక దౌత్య అధికారిగా రవి కోట నియమితులయ్యారు.
1993 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన రవి కోట అసోం క్యాడర్ లో తన ప్రస్థానం ఆరంభించి అంచెలంచెలుగా గుర్తింపు సంపాదించుకున్న ఇప్పుడు అమెరికాలో భారత ప్రత్యేక ఆర్థిక దౌత్య అధికారిగా నియమితులయ్యారు.ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన క్యాబినెట్ నియామకాల కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
రవి కోట వాషింగ్టన్ లోని భారత రాయబార కార్యాలయంలో సంయుక్త కార్యదర్శి హోదాలో వ్యవహరించనున్నారు.తన విధుల్లో భాగంగా భారత్ తరఫున అంతర్జాతీయ ద్రవ్యనిధి, వరల్డ్ బ్యాంకు వ్యవహారాలను పర్యవేక్షిస్తారు.
రవి కోట మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.ఆయన రెండున్నరేళ్లుగా 15వ ఆర్థిక సంఘం సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఆర్ధిక దౌత్య అధికారిగా నియామకం కావడంతో ఇప్పుడు ఏపీలో ఆయన పేరు మారుమోగిపోతుంది.