రేవంత్ రెడ్డి.ఈ పేరుకు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అవసరం లేదు.
ఆకట్టుకునే ప్రసంగం, పదునైన మాటలు, పంచ్ డైలాగులు, ఇలా విభిన్న శైలి తో రేవంత్ రెడ్డి అతి స్వల్పకాలంలోనే కీలకమైన రాజకీయ నాయకుడిగా ఎదిగారు.టిడిపి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన రేవంత్ ఆంధ్ర తెలంగాణ విభజన తర్వాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోతున్న పరిస్థితుల్లో చంద్రబాబు సూచన కాంగ్రెస్ పార్టీలో చేరినట్లుగా అప్పట్లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
ఇక కాంగ్రెస్ పార్టీలో చేరిన అతి తక్కువ సమయంలోనే ఆ పార్టీ హైకమాండ్ దృష్టిలో కూడా పడ్డారు.దీంతో ఆయనకు తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సైతం అధిష్టానం కట్టబెట్టింది.
తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా మల్కాజ్ గిరి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన రేవంత్ ఓటమి చెందారు.
ఆ తర్వాత మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు.
అయితే కొద్ది నెలలుగా తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో తర్జనభర్జనలు జరుగుతున్నాయి.ఈ పదవి దక్కించుకునేందుకు కాంగ్రెస్ సీనియర్ల తో పాటు, రేవంత్ రెడ్డి గట్టిగా కృషి చేస్తున్నారు.
కాంగ్రెస్ సీనియర్ల అంతా కలిసికట్టుగా రేవంత్ కు పిసిసి అధ్యక్ష పదవి దక్కకుండా ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానంతో పదేపదే రేవంత్ పై ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా ఇప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పుచేతల్లో రేవంత్ పని చేస్తున్నారని, ఆయనకు పిసిసి అధ్యక్ష పీఠం అప్పగిస్తే పూర్తిగా చంద్రబాబు చేతుల్లోకి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వెళ్ళిపోతుందని, ఇప్పటికీ రేవంత్ చంద్రబాబు సూచనలు, సలహాలతో ముందుకు వెళుతున్నారని, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అసలు కాంగ్రెస్ రథసారథి గా ఉండేందుకు రేవంత్ కు ఉన్న అర్హత ఏంటి అంటూ ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్లు అధిష్టానాన్ని ప్రశ్నిస్తున్నారు.ఒకవేళ ఆయనకు పిసిసి అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్ పార్టీని ప్రమోట్ చేసుకోవడం మానేసి, తనను తాను ప్రమోట్ చేసుకునే పనిలో ఆయన ఉంటారని, కాబట్టి ఆయనకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఆ పదవి ఇచ్చేందుకు వీల్లేదంటూ కాంగ్రెస్ సీనియర్లంతా మూకుమ్మడిగా అధిష్టానానికి ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది.