కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలు కుదేలవుతున్న విషయం తెలిసిందే.ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా,యూరప్ దేశాలు అయిన ఇటలీ,స్పెయిన్ దేశాలు మరింత గా ఈ మహమ్మారి కి అతలాకుతలం అయిపోయాయి.
అయితే ఇప్పుడిప్పుడే ఆ దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడం తో లాక్ డౌన్ ఆంక్షలను సడలించే ప్రయత్నాల్లో ఉన్నాయి.అయితే కోలుకుంటున్నాం కదా అని ఆంక్షలను సడలిస్తే మూల్యం చెల్లించాల్సిందే అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యూరప్ దేశాల్లో జూన్ నుంచి ఆగస్టులోపు వచ్చే వేసవిలో ఈ వైరస్ మరోసారి విశ్వరూపం చూపే ప్రమాదం ఉందని అక్కడి వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.దీనికి కారణం లేకపోలేదు.
ఎందుకంటే అక్కడ వేసవి అంటే భారత్ లో లాగా 40-45 డిగ్రీల ఎండ ఉండదు.సగటున 20 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి.అయితే వాతావరణం చల్లగా ఉంటే ఈ వైరస్ మరింతగా విజృంభిస్తుంది అని గతంలో నిపుణులు హెచ్చరించిన విషయం విదితమే.గతంలో విధ్వంసం సృష్టించిన వైర్స్ ల తీరును కూడా పరిశీలిస్తే ఈ వాతావరణంలో కరోనా మళ్లీ విశ్వరూపం చూపే ముప్పు ఉందని అక్కడి వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు.
కాబట్టి సభ్యదేశాలన్నీ అప్రమత్తంగా ఉండాలని యూరోపియన్ కమిషన్ అధికార ప్రతినిధి స్టెఫాన్ హెచ్చరించారు.ఈ కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 44 లక్షల మందికి పాజిటివ్ నమోదు కాగా, మరణాలు 3 లక్షలకు చేరువలో ఉన్నాయి.
ఇంతటి ఘోర విపత్తును సృష్టిస్తున్న ఈ కరోనా తో సహజీవం చేయాల్సి ఉంటుంది అని డబ్ల్యూ హెచ్ ఓ కూడా హెచ్చరిస్తుంది.ఈ వైరస్ కు మందు కనిపెట్టడమే తప్ప మరో పరిష్కారం లేదంటూ డబ్ల్యూ హెచ్ ఓ వెల్లడించింది.దీనితో ప్రపంచ దేశాలు మరింత ఆందోళన చెందుతున్నాయి.అందుకే ఈ మహమ్మారికి మందు కనిపెట్టేపనిలో పడ్డారు.