విశాఖపట్టణంలో ప్రజలందరూ నిద్ర మత్తులో ఉన్న సమయంలో వేకువ జామున భారీ ప్రమాదం చోటు చేసుకుంది. గోపాలపట్నం పరిధిలోని ఆర్ఆర్ వెంకటాపురంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి భారీగా కెమికల్ గ్యాస్ లీకైంది.
ఈ గ్యాస్ సుమారు ఐదు కిలోమీటర్ల మేర వ్యాపించడంతో పరిస్థితి విషమంగా మారింది.ఆర్.ఆర్.వెంకటాపురంలో ఉన్న ఆర్జీ పాలిమర్స్ పరిశ్రమలో ఈ అగ్నిప్రమాద సంఘటన చోటు చేసుకుంది.ఈ వాయువు కారణంగా కళ్లు మండుతూ, ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతుండడంతో ప్రజలు ఉన్న ఫళంగా అక్కడి నుంచి దూరంగా తరలిపోతున్నారు.దీంతో ఆ ప్రాంతమంతా తీవ్ర ఆందోళన నెలకొంది.
ఇప్పటికే కొందరు అపస్మారక స్థితికి చేరుకోవడంతో వారిని అంబులెన్సుల్లో ఆసుపత్రులకు తరలిస్తున్నారు.
పోలీసులు, ఉన్నతాధికారులు అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని ప్రజలను ఇళ్లు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకి తరలిస్తున్నారు.
నాయుడు తోట, పద్మనాభపురం, కంపరపాలెం ప్రాంతాల్లోనూ రసాయన వాయువులు వ్యాపించడంతో అక్కడుండే వారంతా ఇళ్లను ఖాళీ చేసి వాహనాల్లో, పరుగులు తీస్తూ దూరంగా వెళ్లిపోతున్నారు.వృద్ధులు, చిన్నారులు శ్వాస ఆడక ఇబ్బందులు పడుతున్నారు.
అయితే కలెక్టర్ వినయ్ చంద్ ఈ ఘటనపై వెంటనే వివరణ ఇచ్చారు.లీకైన గ్యాస్ వల్ల ప్రాణ నష్టం ఉండదు.
స్పృహతప్పి పడిపోవడం ఈ గ్యాస్ సహజ లక్షణం.నిద్రమత్తులో ఉండి వాయువు పీల్చడం వల్ల ఎక్కువ మంది అస్వస్థతకు గురయ్యారు.
వారికి ఆక్సిజన్ ఇస్తే వెంటనే కోలుకునే అవకాశం ఉంటుంది.దాదాపు 200 మంది వరకు అస్వస్థతకు గురై ఉంటారని అంచనా వేస్తున్నాం.
ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, పోలీస్, వైద్య సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారని తెలిపారు.అయితే ఈ గ్యాస్ కారణంగా ముగ్గురు ఇప్పటికే మరణించినట్లు, 20 మంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.