ఏపీ సీఎంగా తన వంతు బాధ్యతను సమర్ధవంతంగానే ఏపీ సీఎం జగన్ నిర్వహిస్తున్నారు.ఇప్పటి వరకు అధికారంలోకి వచ్చిన అతి స్వల్ప సమయంలోనే జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి అమలు చేసిన చరిత్ర లేదు.
అంతగా దేశవ్యాప్తంగా జగన్ మంచి పేరు సంపాదించుకున్నారు.జగన్ కూడా ప్రజాసంక్షేమ పథకాల అమలులో విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని చిత్తశుద్ధితో అమలు చేసి చూపిస్తున్నారు.
దీని కారణంగా జగన్ ఇమేజ్ గతం కంటే రెట్టింపు అయ్యింది.అయితే కొన్ని కొన్ని నిర్ణయాలు అమలు చేసే విషయంలో జగన్ వేస్తున్న తప్పటడుగులు ఆ పార్టీకి, జగన్ కు రావాల్సిన మైలేజ్ రాకుండా చేస్తున్నాయి.
వాస్తవంగా జగన్ కు రాజకీయ సలహాదారుల కొరత లేదు.అయితే వాళ్ళ సలహాలు జగన్ తీసుకుంటున్నారా ? అసలు వాళ్ళు సలహాలు ఇస్తున్నారా లేదా అన్న అనుమానం అందరిలోనూ తలెత్తుతోంది.
ఎందుకంటే కరోనా విషయంలో జగన్ ఎంత సమర్ధవంతంగా పని చేస్తున్నారో అందరికీ తెలిసిందే.జగన్ నిర్ణయాలు ప్రధాని మోదీ సైతం మెచ్చుకుని దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నారు.ఇంతవరకు జగన్ ను వేలెత్తి చూపేందుకు అవకాశం లేదు.ఏపీలో మద్యం దుకాణాలు తెరవడం, ఒక్కసారిగా జనం భారీ ఎత్తున గుమిగూడడం, ఎవరూ సామాజిక దూరం పాటించకపోవడం వంటి కారణాలతో జగన్ ఒక్కసారిగా అభాసు పాలయ్యారు.
మిగతా రాష్ట్రాల్లో మద్యం షాపులను తెరిచినా, జగన్ అభాసుపాలవ్వడానికి కారణం గతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తూ జగన్ హామీ ఇవ్వడమే.అసలు సంపూర్ణ మద్య నిషేధం విధించడం మన దేశంలో చాలా కష్టమైన పని.అయినా బీహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం దానిని అమలు చేసి చూపిస్తోంది.
గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వం మద్యపాన నిషేధం అమలు చేసిన ఆ తర్వాత మళ్లీ కానీ దాన్ని ఎత్తివేశారు.మళ్లీ జగన్ ఇప్పుడు అదే నినాదాన్ని ఎత్తుకున్నారు.అధికారంలోకి వచ్చారు.
దశలవారీగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని చెప్పారు, చేస్తున్నారు.ఇది ఏదో రోజు దారిలో పడుతుంది అని అంతా అనుకుంటున్న సమయంలో ఆకస్మాత్తుగా కరోనా వైరస్ రావడం లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వం ఆదాయం కోల్పోవడం, ప్రస్తుత పరిస్థితుల్లో ఆదాయం అత్యవసరం కావడంతో మద్యం షాపులు తెరిచేందుకు ఒప్పుకున్నారు.
అదే ఇప్పుడు జగన్ క్రెడిట్ ను దెబ్బ తీసింది.ఎందుకంటే జగన్ కు ఉన్న ఇమేజ్ అటువంటిది.
ఆయన తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారనే పేరు ఉంది.అంతే కాకుండా మహిళల కోసం మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తున్నా అంటూ జగన్ చెప్పుకున్నారు.
బాబు హయాంలో ఉన్న బెల్టుషాపులు రద్దు చేసి ప్రభుత్వం ఆధ్వర్యంలో షాపులను ఏర్పాటు చేసారు.అయితే ఇప్పుడు అదంతా వృధా అయినట్టుగా కనిపిస్తోంది.జగన్ కు పెద్ద ఎత్తున మహిళా ఓటు బ్యాంకు ఉంది.అయితే ఇప్పడు జగన్ నిర్ణయంతో ఒక్కసారిగా మొత్తం డ్యామేజ్ అయ్యింది.
దీంతో ఇప్పటి వరకు కరోనా సమయంలో జగన్ సమర్థవంతంగా అమలు చేస్తున్న డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీ రుణాలు, పూర్తి స్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్, తెల్ల రేషన్ కార్డుదారులకు వెయ్యి రూపాయలు నగదు ఇవ్వడం, మూడుసార్లు రేషన్ ఇలా అన్ని విషయాల్లో మంచి పేరు తెచ్చుకున్న జగన్ మద్యం షాపులు అకస్మాత్తుగా తెరవడంతో ఒక్కసారిగా అభాసుపాలయ్యారు.అయితే కేంద్రమే ఈ సడలింపు ఇచ్చినా వాటిని అమలు చేసే నిర్ణయం రాష్ట్రాలకి వదిలివేయడంతో ఇప్పుడు ఆ అపవాదు మొత్తం జగన్ పై వచ్చి పడింది.