అమెరికాలో కరోనా దెబ్బకు ఎక్కువగా దెబ్బతిన్న రాష్ట్రాలైన న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో ప్రస్తుతం కొంతమేరకు ఉపశమన ఛాయలు కనిపిస్తున్నాయి.రెండు రాష్ట్రాల్లోనూ కొత్త మరణాల సంఖ్య గణనీయంగా తగ్గింది.
న్యూయార్క్లో సోమవారం 337 మంది మృత్యువాతపడ్డారు.గత నెల రోజులుగా మరణ మృదంగం మోగిస్తున్న ఈ రెండు రాష్ట్రాల్లో ఒక్కరోజులో చోటు చేసుకున్న అత్యల్ప మరణాలు ఇవే.అటు న్యూజెర్సీలో తాజాగా 106 మంది కన్నుమూశారు. పరిస్థితులు మెరుగుపడ్డప్పటికీ నిషేధాజ్ఞల సడలింపు విషయంలో తాము తొందరపడబోమని న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ క్యుమో చెప్పారు.
అయితే కోవిడ్ 19 కారణంగా దెబ్బతిన్న ఆర్ధిక రంగానికి పునరుత్తేజం కల్పించేందుకు, వ్యాపార కార్యకలాపాలను తిరిగి ప్రారంభించేందుకు గాను న్యూయార్క్ గవర్నర్ ప్రముఖుల సలహాలు కోరుతున్నారు.ఇందుకు గాను ఆయన పలు రంగాలకు చెందిన ప్రముఖులతో న్యూయార్క్ ఫార్వర్డ్ రీ ఓపెనింగ్ అడ్వైజరీ బోర్డును ఏర్పాటు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా వ్యాపార, సామాజిక రంగాలకు చెందిన సుమారు 100 మంది ఈ బోర్డులో ఉన్నారు.దీనికి మాజీ కార్యదర్శులు స్టీవ్ కోహెన్, బిల్ ముల్రో నేతృత్వం వహిస్తారు.
ఇందులో మాస్టర్ కార్డ్ సీఈవో అజయ్ బంగాతో పాటు టాండన్ క్యాపిటల్ అసోసియేట్స్ చంద్రికా టాండన్, న్యూయార్క్ సిటీ హోటల్ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు సీఈవో విజయ్ దండపాని వంటి భారతీయ అమెరికన్లకు కూడా గవర్నర్ చోటు కల్పించారు.న్యూయార్క్లో లాక్డౌన్ దశలవారీగా ఎత్తివేసేందుకు అవసరమైన సూచనలను ఈ బోర్డు ప్రభుత్వానికి అందజేస్తుంది.
అజయ్ గత పదేళ్లుగా మాస్టర్ కార్డ్కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు.ఆయన స్థానంలో 2021 జనవరి 1న మైఖేల్ మీబాచ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా బాధ్యతలు స్వీకరించనున్నారు.ఇక దండపానికి హోటల్ రంగంలో అపార అనుభవం ఉంది. 2002లో న్యూయార్క్లోని ఆసియన్ అమెరికన్ బిజినెస్ డెవలప్మెంట్ సెంటర్ 50 మంది అత్యుత్తమ ఆసియా అమెరికన్ వ్యాపారవేత్తలలో ఒకరిగా ఎంపిక చేసింది.
కాగా ఇప్పటి వరకు అమెరికాలో 10,35,765 మంది కరోనా వైరస్ బారినపడగా, 59,266 మంది ప్రాణాలు కోల్పోయారు.