కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ కారణంగా పలువురు తమ కుటుంబాలకు, అయినవారికి దూరమయ్యారు.స్వగ్రామాలకు వెళ్లిపోదామంటే ఎక్కడా రవాణా సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం, ఉన్న చోట నుంచి కదిలేందుకు వీలు లేకపోవడంతో కొందరు మానసికంగా కృంగిపోతున్నారు.
ఈ నేపథ్యంలో ఓ ఎన్ఆర్ఐ కరోనా కారణంగా మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటూ, ఆదుకోవాల్సిందిగా ముఖ్యమంత్రికి ట్వీట్టర్ ద్వారా మొర పెట్టుకోవడంతో ప్రభుత్వ యంత్రాంగం కదిలింది.
పంజాబ్ రాష్ట్రానికి చెందిన ఓ ప్రవాస భారతీయుడు హర్సిమ్రాన్ సింగ్, అతని కుటుంబం దుబాయ్లో నివసిస్తోంది.
అయితే అతను సొంత రాష్ట్రంలోనే ఉండి చదువుకుంటున్నాడు.జలంధర్ జిల్లాలోని సిటి గ్రూప్ ఆఫ్ ఇన్ట్సిట్యూషన్స్లో చదువుకుంటూ నాకోదర్ గ్రామంలో నివసిస్తున్నాడు.
ఈ నేపథ్యంలో భారతదేశంలో కోవిడ్ 19 వ్యాప్తి కారణంగా లాక్డౌన్ ప్రకటించడంతో అన్ని రకాల విమాన సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసింది.దీంతో దుబాయ్ వెళ్లడానికి వీలు లేక, అతని కుటుంబం భారతదేశానికి రావడానికి కుదరకపోవడంతో హర్సిమ్రాన్ సింగ్ ఒంటరి వాడయ్యాడు.
పలకరించే దిక్కు లేకపోవడంతో అతను మానసికంగా క్రుంగిపోయాడు.
అయితే ఇదే ప్రాంతంలో అతని మేనత్త నివసిస్తుండటంతో ఆమె దగ్గరకి వెళ్లాలనుకున్నాడు.కానీ కర్ఫ్యూ కారణంగా బయటకు వెళ్లలేని పరిస్ధితి.రోజు రోజుకి పరిస్ధితి క్లిష్టంగా మారడంతో దిక్కుతోచని స్థితిలో ఆ యువకుడు ట్విట్టర్ ద్వారా తన ఆవేదనను పంజాబ్ ప్రభుత్వం, జిల్లా అధికార యంత్రాంగానికి తెలియజేశాడు.
‘‘తాను నాకోదర్ తహసీల్కు పది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ గ్రామంలో ఒంటరిగా ఉంటున్నాను.లాక్డౌన్ కారణంగా తాను మానసిక సమస్యలను ఎదుర్కొంటున్నానని, తనను చూసుకునేందుకు ఇండియాలో తన కుటుంబం లేదని ట్వీట్ చేశాడు.
దీనిపై స్పందించిన పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్.తాను సాయం చేస్తానని చెప్పి, విషయాన్ని వెంటనే జలంధర్ జిల్లా యంత్రాంగానికి బదిలీ చేశారు.
ఆ వెంటనే డిప్యూటీ కమీషనర్, ఎస్ఎస్పీ ఆ విద్యార్ధి నివసిస్తున్న గ్రామానికి వైద్యులతో కలిసి చేరుకున్నారు.వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం, నాకోదర్లో ఉంటున్న అతని మేనత్తతో ఉండటానికి హర్సిమ్రాన్ సింగ్కు అధికారులు అనుమతి ఇచ్చారు.
తనకు సహాయం చేసినందుకు పంజాబ్ ముఖ్యమంత్రికి, జిల్లా అధికార యంత్రాంగానికి హర్సిమ్రాన్సింగ్ ధన్యవాదాలు తెలిపాడు.ఇతని వ్యవహరం వల్ల కరోనా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యంపైనా ప్రభావం చూపుతుందని తెలియజేసింది.
కోవిడ్ 19 వ్యాప్తి ఉద్ధృతంగా ఉన్న నేపథ్యంలో దాని వ్యాప్తిని తగ్గించేందుకు లాక్డౌన్ను అమలు చేయడం మినహా ఏ మార్గం లేదని నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే.