గత ఏడాది జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన కేసీఆర్ కుమార్తె కవిత ఘోర ఓటమి చవి చూశారు.అసలు కవిత ఓటమి చెందుతుందని ముందుగా ఎవరూ ఊహించలేకపోయారు .
టిఆర్ఎస్ పార్టీలో తండ్రికి తగ్గ తనయురాలిగా యాక్టివ్గా ఉంటూ వచ్చిన కవిత, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి చవి చూశారు.ఇక అప్పటి నుంచి టిఆర్ఎస్ పార్టీకి, రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
ఇక తెలంగాణలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కవిత ప్రచారానికి వస్తారని టిఆర్ఎస్ శ్రేణులు ఎదురుచూసినా, కవిత మాత్రం దూరంగానే ఉన్నారు.
ఇక నిజామాబాద్ నియోజకవర్గాన్ని అప్పటి నుంచి ఆమె సందర్శించ లేదు.
కానీ ఇప్పుడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ గా ఆమెను టిఆర్ఎస్ ఎంపిక చేస్తున్న నేపథ్యంలో సంవత్సరం తర్వాత ఆమె నిజామాబాద్ కు చేరుకున్నారు.ప్రస్తుతం కరోనా కారణంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో తిండి లేక ఇబ్బంది పడుతున్న నిజామాబాద్ జిల్లాలోని పేద ప్రజలకు ఆహార పొట్లాలను పంపిణీ చేసేందుకు కవిత పర్యటించారు.
జగిత్యాల లోనూ ఆమె పర్యటించి పేదలకు అన్నదానం చేశారు.అలాగే స్థానిక నాయకులతో కలిసి ఆహార పంపిణీ కేంద్రాలను ఆమె ప్రారంభించారు.
అయితే చాలా రోజుల తర్వాత నిజామాబాద్ రాజకీయాల్లో కవిత యాక్టివ్ కావడంపై టిఆర్ఎస్ శ్రేణులు సంతోషంలో ఉన్నాయి.
బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ను కవిత మాత్రమే దీటుగా ఎదుర్కోగలరని, ఆ పార్టీ నాయకులు భావిస్తున్నారు.అలాగే సీఎం కేసీఆర్ కూడా నిజామాబాద్ రాజకీయాలలో యాక్టివ్ గా ఉండాలంతో సూచించడంతో రాజకీయాల్లో పాల్గొనేందుకు ఇదే సరైన సమయంగా భావించి ఇప్పుడు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.