ప్రపంచం ప్రస్తుతం కరోనా మహమ్మారి ధాటికి వణికిపోతోంది.మనుషులంతా ఒకరికొకరు సాయం చేసి కోవిడ్ను తరిమికొట్టాలని పలువురు నేతలు పిలుపునిస్తున్నారు.
ఈ మాటను కొందరు పాటిస్తున్నారు.చైనా, ఇటలీ, స్పెయిన్, అమెరికాల్లో కరోనా బాధితులు పెరుగుతున్నారు.
ప్రపంచానికే పెద్దన్నగా, సూపర్ పవర్గా ఉన్న అమెరికా సైతం వైరస్ ధాటికి నిస్సహాయంగా మారింది.ఈ క్రమంలో న్యూయార్క్ సిక్కు కేంద్రం సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్న అమెరికన్ల కోసం ఇంట్లోనే భోజనం తయారు చేసి 30,000 ప్యాకెట్లను సిద్దం చేసింది.
న్యూయార్క్ మేయర్ కార్యాలయాన్ని సంప్రదించి ఫుడ్ ప్యాకెట్లను డిస్ట్రిబ్యూషన్ సంస్థలకు అందజేసింది.సోమవారం ఉదయం నుంచి ఏజెన్సీలు న్యూయార్క్ నగరంలోని కోవిడ్-19 బాధితులుగా ఉచిత ఆహారాన్ని పంపిణీ చేస్తున్నాయి.
కరోనా ధాటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్న నగరాల్లో న్యూయార్క్ ముందు వరుసలో ఉంది.సామాజిక దూరాన్ని పాటించడం, ఫేస్ మాస్క్లు, గ్లౌజులు వేసుకుని పరిశుభ్ర పద్ధతుల్లో ఆహారాన్ని తయారు చేస్తున్నారు.
అమెరికన్ గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఈస్ట్ కోస్ట్) సమన్వయకర్త హిమత్సింగ్ మాట్లాడుతూ.సిక్కు వాలంటీర్లు అందించే ప్యాకెట్లలో డ్రై ఫ్రూట్స్, రైస్, కూరగాయాలతో కూడిన ఆహారం ఉందన్నారు.భోజనాన్ని తయారు చేసి ప్యాక్ చేసిన వాలంటీర్లకు వైద్య తనిఖీ ఉంటుందని.ఆ ఆహారాన్ని డాక్టర్లు, ఆరోగ్య అధికారులు ఆమోదించారని హిమత్ సింగ్ తెలిపారు.
వృద్ధులకు, సూపర్ మార్కెట్ వద్ద ఆహారం లభించడంలో ఇబ్బంది పడుతున్న వారికి నిరాశ్రయులు, ఒంటరి తల్లిదండ్రులు, చిన్నారులను చూసుకుంటూ బయటకు వెళ్లలేకపోతున్న వారికి వీటిని అందజేస్తారు.
గురుద్వారాకు గతంలో విరాళంగా ఇచ్చిన ఆహార పదార్ధాలను, నిధులను ఇందుకోసం ఉపయోగిస్తున్నారు.
అలాగే అమెరికా వ్యాప్తంగా ఉన్న యునైటెడ్ సిక్కులు అనే ఎన్జీవో కూడా అన్ని వర్గాల ప్రజలకు విరాళాలు ఇవ్వాల్సిందిగా పిలుపునిచ్చింది.అమెరికా తూర్పు, వెస్ట్ కోస్ట్, మిడ్ వెస్ట్ నుంచి అనేక మంది సిక్కు వాలంటీర్లు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఏజెన్సీలకు సహాయం చేసేందుకు అన్ని రకాల సామాగ్రితో సిద్ధంగా ఉన్నారు.