ఏపీలో కరోనా వైరస్ పై జరుగుతున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు.ప్రపంచవ్యాప్తంగా 171 దేశాలను వణికిస్తున్న వైరస్ ప్రభావం ఏపీలోనూ ఎక్కువగానే కనిపిస్తోంది.
ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించారు.అలాగే ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా కృషి చేస్తూ ప్రజల ఎవరు రోడ్ల మీదకు రాకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.
అయినా ఇంకా దీనిపై ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన రావాల్సి ఉంది.ప్రస్తుతం ఈ వైరస్ మహమ్మారి తీవ్ర తరం అయిన నేపథ్యంలో , రాజకీయాలను పక్కన పెట్టి పార్టీలకు అతీతంగా నాయకులు ప్రజలను చైతన్యవంతం చేయాల్సింది పోయి ఇప్పుడు రాజకీయ విమర్శలు చేసుకుంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం విమర్శల పాలవుతోంది.
ముఖ్యంగా ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం లో ఇంకా విజయం సాధించలేదు.అయితే ఆ విషయాన్ని తెలుగు తమ్ముళ్లు మరిచిపోయి ఏపీ లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి ప్రధాన కారకుడు ఏపీ సీఎం జగన్ అన్నట్లుగా తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా వైరస్ ను పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకు రావడం సాధ్యమయ్యే పనికాదు.
చైనాలో దీనిని అదుపులోకి తెచ్చారు అని ప్రచారం జరుగుతున్న అక్కడ కూడా కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి.
ప్రజలు తమకు తాము నిర్బంధం చేసుకుంటే తప్ప దీని వ్యాప్తిని అరికట్టడం సాధ్యమయ్యే పని కాదు.ఈ విషయం టిడిపి నాయకులకు కూడా బాగా తెలుసు.అయితే అవన్నీ మర్చిపోయి జగన్ ను టార్గెట్ చేసుకుంటూ విమర్శలు చేయడం, జగన్ ఇంటర్ పాస్ అయ్యాడా లేదా ? పారాసెట్మాల్ టాబ్లెట్ వేసుకుంటే కరోనా తగ్గుతుందని చెప్పడానికి ఆయన ఏమైనా డాక్టర్ అంటూ తెలుగుదేశం పార్టీ కి చెందిన మాజీ ప్రభుత్వ విప్ కూనా రవికుమార్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.అసలు ఏపీలో కరోనా వైరస్ అనేది లేదని జగన్ ప్రజలందరినీ తప్పుదోవ పట్టించారని, ఎన్నికలు వాయిదా వేసిన రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను జగన్, ఆయన సహచర మంత్రులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారని, కూనా మండిపడ్డారు.
మొదట్లో జగన్ చేసిన ప్రార్థనల్లో తప్పు ఉండి ఉండవచ్చు కానీ ఈ కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరం అయిన నేపథ్యంలో వాటిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉంది కానీ అవన్నీ మర్చిపోయి యధావిధిగా రాజకీయ విమర్శలు చేయడం విమర్శల పాలవుతోంది.
వీలైతే ఈ వైరస్ వ్యాప్తిని మరింత విజృంభించకుండా ప్రభుత్వానికి, ప్రజలకు సరైన సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా పోయి రొటీన్ గా విమర్శలు చేయడం మరిన్ని విమర్శలకు కారణం అవుతోంది.అసలు సీఎంగా జగన్ పనికిరాడని వెంటనే ఆయన రాజీనామా చేసి చంద్రబాబుకు సీఎంగా బాధ్యతలు అప్పగిస్తే కంట్రోల్ చేస్తాడనే విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు.