కరోనా వైరస్ కారణంగా భారతదేశంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.కోవిడ్-19కు అడ్డుకట్ట వేసేందుకు గాను కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ దిశగా అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఇప్పటికే వైరస్ ఉద్ధృతి అధికంగా ఉన్న 80 జిల్లాలను లాక్ డౌన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.సామాజిక బాధ్యతతో మెలుగుతూ మన కుటుంబాన్ని, దేశాన్ని కాపాడుకోవాల్సిన తరుణంలో కొందరు మాత్రం ఏం పట్టనట్లుగా వ్యవహరిస్తూ తమతో పాటు సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు.
విదేశాల నుంచి తిరిగివచ్చిన వారు ఖచ్చితంగా 14 రోజుల పాటు సెల్ఫ్ క్వారంటైన్లో ఉండాలని ప్రభుత్వాలు నెత్తి నోరు బాదుకుంటున్నా కొందరు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.కొద్దిరోజుల క్రితం సింగర్ కనికా కపూర్ ఇలానే చేయడంతో పాటు ఏకంగా పార్టీలకు వెళ్లి పార్లమెంట్ నుంచి రాష్ట్రపతి భవన్దాకా అందరినీ టెన్షన్లోకి నెట్టింది.
మొన్న మధ్యన వరంగల్కి చెందిన ఓ ఎన్ఆర్ఐ విదేశాల నుంచి వచ్చాడు.పోలీసులు, అధికారులు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు.
అయినా ఏమాత్రం బాధ్యత లేకుండా ఆ వ్యక్తి 1000 మందిని పిలిచి ఘనంగా పెళ్లి చేసుకున్నాడు, అక్కడితో ఆగకుండా రిసెప్షన్కు తయారయ్యాడు.ఈ విషయం తెలుసుకున్న పోలీసులు రిసెప్షన్ను నిలిపివేయించారు.
తాజాగా పంజాబ్లో ఓ ఎన్ఆర్ఐ ఇలాగే చేయడంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.భవానీగర్ పోలీస్ స్టేషన్ సమీపంలోని బింబ్రి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి న్యూజిలాండ్లో స్థిరపడ్డాడు.పెళ్లి కోసం అతను మార్చి 10న భారతదేశానికి వచ్చాడు.అయితే నిబంధనల ప్రకారం విదేశాల నుంచి వచ్చిన వారు ఖచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి.
అయితే పెళ్లి తేదీ నిశ్చయమైపోవడంతో అతను పోలీసులు, అధికారులు ఎంతగా నచ్చచెప్పినా వినకుండా నిన్న పెళ్లి చేసుకున్నాడు.దీంతో అతనిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.